నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆవకాయ పచ్చడి తయారీ కార్యక్రమం మా చిన్నప్పుడు 1950, 1960 దశకాలలో మా నాయనమ్మ దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో జరిగే పద్థతి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు పెద్ద కుటుంబం. మా అమ్మా, నాన్నా, నాయనమ్మా, పిల్లలం మేము ఆరుగురం. వెరశి తొమ్మిది మంది. ఇకపోతే ఇంటికి తాత్కాలిక అతిథుతులుగా వచ్చే మా నాన్న సాహిత్య బృందం, మా కాకతీయ ప్రెస్ లోనే ముద్రింపబడే అప్పటి, ‘ధర్మ భూమి’, ‘విశ్వజ్యోతి’ సంపాదకులు కనకదండి చంద్రమౌళీశ్వర రావు, కటంగూరి నరసింహారెడ్డి గార్లు నెలకు 10 రోజుల ‘తిండీ – నిద్రా’ కార్యక్రమం మా ఇంట్లోనే.

ఇక అప్పటి మా నాయనమ్మ ప్రత్యేక ఆవకాయ పచ్చడ్ల పేర్లు: పెద్ద జాడీలలో నూనె ఆవ, లవంగాలు కలపిన మసాలా ఆవ, నీళ్ల ఆవ, బెల్లం ఆవ.
ఇక చిన్న జాడీ లలో చెక్కు తొక్కు, మాగాయ, వెల్లిపాయ ఆవ, నువ్వుల ఆవ. సరే మన తెలుగు వారి ప్రత్యేకం ఈ రకరకాల ఆవకాయల గురించి కండ్లు మూసుకొని ఆలోచిస్తూ వుంటే నిద్ర పట్టింది. కాసేపటికి ఎవరో తట్టి లేపారు. విసుక్కుంటూ కండ్లు తెరిచేసరికి నారద రూపంలో కాంతారావు గారు. సంతోషంగా ఆయనతో ‘భలే మంచిబేర మూ’ పాట పాడండని కోరాను. ‘నీ పాట చల్ల గుండా! ముందు నాతో రా’ అని చేయి పట్టుకొని ఆకాశంలో పైకి తీసుకు పోయాడు.
నేనన్నాను నారద కాంతారావుతో -‘ నిజమే. వీరికి ఇదే శాస్తి. ఇంతమంది పాపాత్ములు. ఆ కొద్ది మంది నిజంగా అమృత పానీయానికి, నందన వన పారిజాత సువాసన లకు అర్హులు’. ‘చూడవయ్యా, సరిగ్గా ఆ గుంపును. అందులో ముప్పావు భాగం మొన్న నే ముగిసిన మహా కుంభాభిషేకం లో పవిత్ర గంగా స్నానమాచరించి తమ పాప ప్రక్షాళన చేసుకున్న వారే. వారు కూడా వివిధ విమానాలలో స్వర్గ ద్వారం ముందు దిగి ఆహ్వానం అందుకున్న వారే.””మరి అటు వైపు పోకుండా ఇటు వెళ్తున్నారు ఏమిటి స్వామీ?’ అన్నాను అయోమయంగా. అసలే ఆయన నారదుడు. సమాధానం నోటితో ఎందుకు చెప్తాడు? ‘అటు చూడు’ అని చూపుడు వేలితో చూపించాడు.
ఇంతకు ముందే విమానం దిగిన ఆ ఇరవై మంది లో 15 మంది ‘ఆవకాయ లేని భోజనం మా కేందుకు? అమృతమూ వద్దు, ఆ పారిజాత సువాసనలూ వద్దు ఆవకాయనే మా మరణాత్మక మధురం’ అని వెనుదిరిగి పరుగెత్తి నరక ద్వారపు గుంపులో కలిశారు. ‘ఏమిటి మహాత్మా, ఈ విచిత్రం?’ అని అడిగిన నా భుజం తట్టి “ఏమీలేదు. ఆ మధ్య నరకంలోని వంట వాళ్లు యమధర్మరాజుతో ” ఈ పాపాత్ములకు మేము ఒక కూర, ఒక చారు రోజూ చేయడం మానివేయాలని నిర్ణయించుకున్నాం! ఎంత కాలం వీళ్లకు వండిబెట్టాలి?” అని స్ట్రైక్ నోటీసు ఇచ్చారు. యముడు ఆలోచించి విష్ణుమూర్తి అనుమతితో నలుగురు వంట వారిని స్వర్గానికి పంపించి దుర్గమ్మ గారి దగ్గర పలు రకాల ఆవకాయ పెట్టు ప్రక్రియల్లో శిక్షణ ఇప్పించాడు. అట్లాగే స్వర్గంలో ఆవకాయ వాడకం నిషేధించారు. శిక్షణ తర్వాత వారు తిరిగి యమ లోకానికి తిరిగి వచ్చి ఆరు నెలల కొక్కసారి ఆవకాయ లను పెట్టి దానిని కేవలం బ్రెడ్ తో పాపాత్ములకు పెట్ట సాగారు. వారికి పని భారం తగ్గింది. పాపాత్ము లకు “ఆహా బాగు, బాగు” అనిపించింది. స్వర్గ వాసుల జిహ్వలు చచ్చు బడ్డాయి. దుర్గమ్మ గారికి పచ్చడి పెట్టే శ్రమ తగ్గింది.
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు.