రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అమల్లో లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియ పేదలు, దళితులు, మైనారిటీల వోట్లను తొలగించేలా ఉందంటూ ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమ వోటుబ్యాంకును ఎక్కడ కోల్పోతామోనన్న భయం ఆయా రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్న మాట నిజం. సర్ ఫారాల పంపిణీలో తీవ్ర ఆలస్యం , బూత్ లెవల్ అధికారుల (బీఎల్ ఓ) కొరత, నగరంలో ఫారాల పంపిణీ సమస్యలు తలెత్తుతున్నాయి. తొలిరోజు అంటే 25వ తేదీన దీనిపై హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో స్థానికంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో అధికారుల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. బూత్ లెవల్ అధికారుల గైర్హాజరు, వారి వద్ద సరైన సిబ్బంది లేకపోవడం వంటి కారణాలతో పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ వ్యక్తిగత వివరాల సేకరణపై అనుమానాలతో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు నిరసనలకు దిగారు. అయితే, దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం కావడంతో ఈ సర్వేపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, వోటర్ల జాబితా సవరణకే పరిమితమని రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం నెలకొంది. మార్పులు లేదా చేర్పుల కోసం నిరూపించాల్సిన అవసరమైన అధికారిక పత్రాలు (ఐడెంటిటీ ప్రూఫ్స్) అందరి వద్ద అందుబాటులో ఉండకపోవడం మరో సమస్య. కొన్ని ప్రాంతాల్లో కేవలం తెలుగులోనే ఫారాలు ఉండటంతో, ఇతర భాషలు మాట్లాడే వోటర్లు వాటిని చదివి నింపడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.ఫారాలు నింపేటప్పుడు వొచ్చే సందేహాలను తీర్చడానికి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఫారాలను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసి సబ్మిట్ చేయాలనుకునే వారికి వెబ్సైట్ స్లోగా ఉండటం, ఓటిపి రాకపోవడం వంటి సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయి. అందరికీ వెబ్సైట్లోకి వెళ్లి పారం పూర్తిచేయడం తెలియకపోవడంతో మరింత గందరగోళం నెలకొంటున్నది.
రాష్ట్రంలో దాదాపు 89 లక్షల వోటర్ల రికార్డులలో తప్పులు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిశీలనలో పెట్టడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తగిన ఆధారాలు చూపించకపోతే తమ వోట్లు ఎక్కడ తొలగిస్తారోనని ముఖ్యంగా పేదలు, మహిళలు, గిరిజనులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి అర్హులైన నిజమైన వోటర్ల వోట్లను తొలగించడానికి కుట్ర పన్నుతున్నాయని కాంగ్రెస్, బిఆర్ఎస్, మరియు లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరంలో కేవలం తెలుగులోనే సర్వే ఫారాలు పంపిణీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వొచ్చింది. నగరంలోని బహుభాషలు మాట్లాడే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్ ఫారాలను ముద్రించాలని నిర్ణయించారు.
అయితే, బహదూర్పురా, యాకుత్పురా, ముషీరాబాద్, మరియు జూబ్లీహిల్స్ వంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంగ్లీష్ ఫారాలు సకాలంలో చేరకపోవడంతో మొదటి రోజు పంపిణీ నిలిచిపోయింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాక ఈసీ హైదరాబాద్లో ఇంగ్లీష్ ఫారాలకు అనుమతి ఇచ్చింది. 25 ఏళ్ల తర్వాత (చివరిగా 2002లో జరిగింది) చేపట్టిన ఇంత పెద్ద ప్రక్రియను కేవలం ఒక నెల రోజుల్లో (జూన్ 25 నుండి జూలై 24 వరకు) ముగించాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వొస్తున్నాయి. ఈ గడువును 1-2 ఏళ్ల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, బీఎల్వోల క్షేత్రస్థాయి విధుల్లో పారదర్శకత లేదని, ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండానే ముందస్తుగా నింపిన ఫారాలపై సంతకాలు సేకరిస్తున్నారని ఆరోపణలు వొస్తున్నాయి.




