దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన
ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం..
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఈడీ కార్యాలయం వద్ద ధర్నా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన సాగిస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు గురువారం టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీగా వొచ్చారు.ఈడీ ఆఫీస్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నఈ ర్యాలీకి ఉప ముఖ్యమంత్రి భట్టి వికృమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్ ఠాగూర్ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని ధర్నా చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయిన నేషనల్ హెరాల్డ్ పేపర్ కి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనీ లాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని, మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరని అన్నారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్, దేశ ప్రజా గొంతుక అని, రాహుల్ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అన్నారు. కులగణనతో రాహుల్ గాంధీ మోదీకి రాజకీయ మరణ శాసనం రాశారన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఎలాగైనా గెలవడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎన్నికలు రాగానే ప్రతి పక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ, అమిత్ షా కు అలవాటుగా మారిందన్నారు.
గుజరాత్ లో ఏఐసిసి సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు అసమానమైనవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మోదీకి మరణ శాసనంగా మారిందన్నారు. వయసు కూడా చూడకుండా సోనియాగాంధీ పేరు చేర్చడం బాధాకరమని అన్నారు. కుల సర్వే ఛాంపియన్ గా కాంగ్రెస్ నిలిచిందన్నారు. 1937లో నెహ్రూ ఏజీఎల్ సంస్థ అప్పటి నుంచి దేశానికి సేవ చేస్తోందన్నారు. నష్టాల్లో ఉంది కాబట్టే కాంగ్రెస్ రుణం ఇచ్చిందన్నారు. అది కాంగ్రెస్ సొంత పత్రిక అని, సొంత పత్రిక నష్టాల్లో ఉంటే డబ్బులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అది మనీ లాండరింగ్ గా చూపించి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. యంగ్ ఇండియా కాంగ్రెస్ అంతర్భాగం అని అన్నారు. గుజరాత్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ పెడితే బిజెపికి వణుకు పుట్టిందన్నారు. కేసుల ద్వారా సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలంటే అది అవివేకం అవుతుందన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందనన్నారు. 12 ఏళ్ల కిందటి కేసును ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనుకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతున్న రూపాయి విలువ, నిరుద్యోగం తదితర సమస్యలపై నిలదీస్తున్నందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన గాంధీ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందన్నారు. కక్షాపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.