రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం కానీ, వ్యవసాయం చేస్తున్న రైతులో మెజారిటీ “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి ఉనికి శూన్యం. 28 నెలల కిందట అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘ఆరు గ్యారంటీలలో’ కౌలు రైతులకు భరోసా ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం విచారకరం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇది లక్షలాది మంది సాగుదారులలో ఆశలు చిగురింపజేసింది. అయితే, అధికారంలోకి వొచ్చి రెండేళ్లు దాటినా, ఈ పథకం అమలుకు షురూవాత్ “కౌలు రైతుల గుర్తింపు” ప్రక్రియ ప్రారంభం కాలేదు.
2011 నాటి ‘ఆంధ్రప్రదేశ్ భూ అధీకృత సాగుదారుల చట్టం’ (తెలంగాణకు వర్తిస్తుంది) ప్రకారం కౌలు రైతులకు “LEC (Loan Eligibility Cards)” కార్డులు మంజూరు చేయాలి. ఈ కార్డు ఉంటేనే రైతుకు బ్యాంకు రుణాలు, పంట బీమా, పెట్టుబడి సాయం వంటివి అందుతాయి. కానీ, వోటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ఈ వ్యవస్థలో, భూయజమానుల ఆగ్రహానికి గురికావాల్సి వొస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి వెనుకాడుతోంది.
ఒక కౌలు రైతు సాగు చేసే క్రమంలో మూడు ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటున్నాడు..మొదటిది పెట్
2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు కార్డులు ఇవ్వడం వల్ల భూయజమాని హక్కులకు ఎటువంటి భంగం కలగదు. ఇది కేవలం సాగు హక్కును గుర్తించడం మాత్రమేనని చట్టం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, భూస్వాముల ఒత్తిడి లేదా రికార్డుల గందరగోళం వల్ల రెవెన్యూ యంత్రాంగం ఈ దిశగా అడుగులు వేయడం లేదు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడవడం తెలంగాణ వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే, అందులో 75 శాతం పైగా కౌలు రైతులే ఉండటం అత్యంత విషాదకరం. “అన్నదాత” అని పిలుచుకునే నోటితోనే, వారిని గుర్తింపు లేని కూలీలుగా చూడటం నాగరిక సమాజానికి తగదు. ప్రభుత్వం తన ఆరు గ్యారంటీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, 22 లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలి.”నేల నీది కాకపోవచ్చు.. కానీ స్వేదం నీది, శ్రమ నీది” అని కౌలు రైతుకు భరోసా ఇచ్చినప్పుడే తెలంగాణా వ్యవసాయం సుభిక్షంగా మారుతుంది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా, 2011 చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతును సాగుదారుడిగా గుర్తించడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.





