కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: మహిళా సాధికారత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఎస్టేట్, అర్బన్ కమ్యూనిటీ విభాగం అడిషనల్ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జోనల్ పిఓ లు, అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులతో ఆ శాఖల ప్రగతి పై కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… మహిళా సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలను కోటేశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ఉన్నందున అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించి వారికి బ్యాంక్ లింకేజి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులైన మహిళలందరిని స్వయం సహాయక సంఘాల గ్రూప్ లో సభ్యులుగా చేర్చి ఆర్థిక సాధికారత కు దోహద పడే విధంగా కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.
బ్యాంక్ లింకేజి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,240 స్వయం సహాయక సంఘాలకు 704.67 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ .543.43 రూపాయలను, 5016 సంఘాలకు బ్యాంకు లింకేజీ పంపిణీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా మహిళలకు రూ.412 కోట్ల విలువ గల 487 యూనిట్లు అందించాలని లక్ష్యంగా కాగా 1.59 కోట్ల రూపాయల విలువ గల 184 యూనిట్ లకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం 7వేల మహిళా ఎంటర్ ప్రేనియార్ షిప్ నెలకొల్పేందుకు నగర వ్యాప్తంగా 410 కోట్ల రూపాయలతో 6000 వ్యక్తిగత ఎంటర్ ప్రైజేస్, మరో 1000 గ్రూప్ ఎంటర్ ప్రైజేస్ ఏర్పాటుకు చర్యలు తీసుకో నైనది. ఇందిరా మహిళా శక్తి స్కీం ద్వారా గ్రూప్, వ్యక్తిగత ఎంటర్ ప్రేనియర్ ఏర్పాటు రుణాలు అందించేందుకు గుర్తింపు చేసి ప్రాధాన్యత క్రమంలో జనవరి 20 వరకు రుణాలు అందించేందుకు తీసుకోవాలన్నారు.
ఇదే క్రమంలో పిఓ లు, డిపిఓ లు సర్కిల్ వారీగా సిఓ, ఆర్ పి వారీగా టార్గెట్ నిర్ణయించి అట్టి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అందు కోసం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రోజువారీగా సమీక్షించాలని ఆదేశించారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు డిసెంబర్ మాసంలో పూర్తి చేయాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే పిఓ లు, డిపిఓలను ఆదేశించారు. మైక్రో క్రెడిట్ ప్లాన్ బ్యాంక్ లకు అందజేసి 1500 కోట్ల బ్యాంక్ లింకేజిని మార్చి 2025 వరకు ప్రగతి సాధించే విధంగా కార్యాచరణ చేసుకోవాలన్నారు. 500 కోట్ల విలువ గల మైక్రో క్రెడిట్ ప్లాన్ డిసెంబర్ చివరి వరకు తయారు చేసి బ్యాంక్ కు సమర్పించిన తర్వాత వచ్చే జనవరి మాసం చివరి వరకు గ్రౌండిరగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన నిరుపేద మహిళలను గుర్తించి వారందరినీ గ్రూప్ గా తయారు చేసి వారికి కూడా ఆర్థిక సాధికారత సాధించేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించాలన్నారు. ఇప్పటి వరకు 1062 కొత్త గ్రూప్ లను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కమీషనర్ చంద్రకాంత్ రెడ్డి వివరించగా నగరంలో సుమారు 24 లక్షల గృహాలు ఉన్నాయని ఒక్కొక్క ఇంటికి ఒక మహిళ ను హెచ్ ఎస్ జి గ్రూప్ లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చెందితే కుటుంబం మొత్తం ఆర్థికాభివృద్ధి చెందే వెసులుబాటు ఉంటుందన్నారు. షెల్టర్ హోమ్ లను పి ఓ లు ఎప్పటికప్పుడు పరిశీలించి కనీస అవసరాల పై దృష్టి సారించాలని అవసరమైతే సి ఎస్ ఆర్ పద్దతి ద్వారా నిరుపేదలకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్ లింకేజి, నూతన గ్రూప్ ల ఏర్పాటు, ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ప్రగతి పై ప్రతి వారం సర్కిల్ వారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ఆస్తులను కంప్యూటరైజ్ చేయాలి: కమిషనర్
నగర వ్యాప్తంగా ఉన్న జిహెచ్ఎంసి ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రార్ ఏర్పాటుచేసి దాని ప్రకారం గా కంప్యూటరైజ్ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆస్తులకు సంబంధించిన లీజు పూర్తయిన, ఇంకా కొనసాగుతున్నట్లు వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా ఇతరులు ఉపయోగించుకుంటున్నారా అని క్షేత్ర స్థాయిలో జోనల్ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు విచారించి నివేదిక అందజేయాలన్నారు. ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రార్ తప్పని సరిగా ఉండాలని, ఆస్తులు కంప్యూటరైజ్ చేసి అందులో పూర్తి వివరాలు ఉండాలని లీజు ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు పూర్తవుతుంది వివరాలు పూర్తి సమాచారం ఉండాలన్నారు. ఆస్తులు కంప్యూటర్ లో నే ప్రజలకు పూర్తి వివరాలు తెలియాలని అధికారులను ఆదేశించారు. లీజు మార్కెట్ రేటు ప్రకారం గా కేటాయింపు జరుగాలని, లీజు పూర్తయిన ఇంకా కొనసాగుతున్న వివరాలను పూర్తి నివేదిక అందజేయాలన్నారు.
అంతేకాకుండా కంప్యూటర్ చేసేందుకు అవసరమైన డెడికేటెడ్ డెవలపర్ ను ఏర్పాటు చేసుకోవాలని ఐటీ ఆధికారులను ఆదేశించారు. అద్దె చెల్లింపు కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కొక్క ఆస్తికి ఒక ఐడి కేటాయించాలన్నారు. అసలు జిహెచ్ఎంసి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో క్షేత్ర స్థాయి అధికారులు తెలుసా అని కమిషనర్ ప్రశ్నించారు. అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. వీటిని కూడా కంప్యూటరైజ్ చేసి లోకేషన్ కూడా పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్స్ వినియోగంలో ఉన్నాయా? ఎవరి ఆధీనంలో ఉన్నాయో వివరాలను సేకరించి అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమీషనర్ సి. చంద్రకాంత్ రెడ్డి, యు సి డీ ప్రాజెక్టు డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.సురేష్ కుమార్, 30 సర్కిళ్ల ప్రాజెక్ట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.