తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ ( విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు-2026పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇది వాక్స్వాతంత్య్రాన్ని హరించేదిగా ఉందని, తప్పు ఒప్పులను నిర్ణయించే విషయంలో ఈ బిల్లులో స్పష్టత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని అధికార వర్గాలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా తమకు వ్యతిరేకమైన వారిపైన ప్రతీకార చర్యలు తీసుకోవాలనుకునేవారికి ఇది ఒక ఆయుధంగా మారుతుందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా బిజెపి, సిపిఐ, ఎంఐఎం లు దీన్ని వ్యతిరేకించాయి.
అప్పటికే సస్పెండ్కు గురికావడంతో బిఆర్ఎస్ శాసనభ్యులెవరూ ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో లేకపోయినా ఆ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్)బిల్లు ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే తెచ్చిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంచేసే తప్పులను ఎత్తిచూపే పత్రికలు, సోషల్ మీడియా లేదా విపక్షపార్టీల నాయకులు ఎవరిపైనైనా దీన్ని ప్రయోగించి వారి గొంతు నొక్కే విధంగా అందులో పదజాలాన్ని పొందు పర్చారాని ఆయన ఆరోపిస్తున్నారు.
విచిత్రమేమంటే అధికార కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ, ఎంఐఎం పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేక చర్యలకు పాల్పడినవారిపైన చర్య తీసుకునేందుకు భారత న్యాయసంహిత (బిఎన్ఎస్)కింద ఇప్పటికే నిబంధనలుండగా మళ్ళీ కొత్తగా ఈ చట్టం దేనికని ఎంఐఎం శాసనసభ్యులంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీచేయకుండానే నేరుగా రిమాండ్కు పంపడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. దీనివల్ల ఒక విధంగా వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందంటున్నారు. సిపిఐ పార్టీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా అలాంటి వ్యాఖ్యానమే చేశారు.





