హామీల అమలులో ప్రభుత్వం విఫలం
గ్యారంటీలను అమలు చేయలేమని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు.
రాజ్యసభ సభ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలే స్వయంగా ఒప్పుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బహిరంగంగానే అంగీకరించడం.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిందని డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు.
తెలంగాణలోనే కాదు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలోనూ కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే దగా, మోసమని ప్రజలు గ్రహించి హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టారు.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ముంచేశారు.
ఇప్పుడు దిల్లీలో దిక్కులేకుండా పోయేలా, డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వబోతున్నారంటూ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రిటైర్ట్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టు నోటీసులను కూడా పట్టించుకోకుండా బేఖాతర్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్ల విశ్రాంత ఉద్యోగులు తమ బిల్లుల కోసం తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 317 జీవోను తీసుకువచ్చి టీచర్లను గోసపెట్టిందని.. దానికి వ్యతిరేకంగా ఉద్యోగుల తరఫున కొట్లాడింది భారతీయ జనతా పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రేకులు వేయకపోతే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పకుంటే ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులను మరిన్ని తిప్పలు పెడుతుందని ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం బిజెపి ప్రజల గొంతుగా నిలబడి హక్కులను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని డాక్టర్ కె.లక్ష్మణ్ కోరారు.