– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క
– సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వేం నరేందర్రెడ్డి చెప్పారు. పస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ ఎంపిక చేయగా ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపుల తర్వాత నరేందర్రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యమవుతుంది. ఆ పార్టీ పోటీలో లేకుంటే రెండు స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. మొదటి స్థానానికి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు తెలిపింది.

సీతక్క అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: అసెంబ్లీ ఆవరణలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల నామినేషన్ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. అభ్యర్థులకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.