ఆయుష్‌ ఆధ్వర్యంలో యోగా డే ఏర్పాట్లు పూర్తి

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా కార్యక్రమం నిర్వహణపై తెలంగాణ ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్‌ శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్షించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్‌ శాఖకు చెందిన యోగా శిక్షకులు, మెడికోలు, వివిధ పాఠశాలలకు చెందిన 5,500 విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఉదయం 6.20 నుండి 6.30గంటల వరకు స్టేడియంలో యోగా ఫొోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తారు. 6.30 నుండి 7 గంటల వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగాన్ని వీక్షించేందుకు స్టేడియంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 7 గంటల నుండి 7.45 వరకు యోగా కార్యక్రమం ఉంటుంది.
తర్వాత యోగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తారు. 7.50 గంటల నుండి రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రసంగిస్తారు. 8.05 నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, 8.15 నుండి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం 8.20 నుండి 8.30 వరకు ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా బెలూన్స్‌ను గౌరవ అతిథులు ఆకాశంలోకి వదులుతారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, మేయర్‌ విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page