వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఖర్చులకు పోతే ఇక బడ్జెట్లో మిగిలేది ‘‘హళ్ళికి హళ్ళి, సున్నాకి సున్నా!?’
అనేక ఏళ్ళుగా సతికిల పడిపోయిన ప్రభుత్వ బడుల తలరాత మారుస్తామని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ నియమించింది.కమిషన్ సుదీర్ఘ కసరత్తు చేసి ప్రభుత్వ బడుల స్థితి గతులు మార్చడానికి కొన్ని కీలక మైన సిఫార్సులే చేసింది.ఇప్పుడున్న స్థితిలో ప్రభుత్వ బడులను విలీనం చేసి మండలం యూనిట్ గా ఒక బృహత్ ప్రణాళిక రూపొందించింది. మండలానికి నాలుగు ఫౌండేషన్ పాఠశాలలు, ఒక్కో దానిలో(250పిల్లలు)నర్సరీ నుండి 2వ తరగతి వరకు, మండలానికి మూడు తెలంగాణా పబ్లిక్ పాఠశాల లు (1500-1800పిల్లలు)తో ఏర్పాటు చేయాలని, తెలంగాణా పబ్లిక్ పాఠశాల కు 5-10 ఎకరాల స్థలం, ఫౌండేషన్ స్కూల్ కు కనీసంగా అర ఎకరం స్థలం ఉన్న పాఠశాలలు ఎంపిక చేయాలని విద్యా కమిషన్ సూచించింది.అంతేకాదు ఎలాంటి కొరత లేని నాణ్యమైన వసతులు,ఫర్నిచర్ తోపాటు,కెవైసి డిజిటల్ రన్నింగ్ బోర్డులను, ఇంటర్నెట్ సౌకర్యం, ఏఐ అధునాతన టెక్నాలజీని అందుబాటులో కి తేవాలనేది కూడా కమిషన్ సిఫార్స్ లలో కీలకమైనవి.అవసరం అయినచోట క్యాచ్ మెంట్ ఏరియా నుండి పిల్లల కొరకు ఉచిత ట్రాన్స్ పోర్ట్ (మినీ బస్సు) సౌకర్యం కూడా కమిషన్ సిఫార్స్ చేసింది.ప్రభుత్వ బడుల సంస్కరణలకు అయ్యే ఖర్చు కూడా అంచనా వేసి ప్రభుత్వం కు నివేదిక అందించింది.ఒక్కోతెలంగాణా పబ్లిక్ స్కూల్ కు12కోట్లు, తెలంగాణా ఫౌండేషన్ స్కూల్ కు 3.5 కోట్లు రూపాయలు ఖర్చును అంచనా వేయడంతో పాటు మండలానికి 50కోట్లరూపాయలు చొప్పున మొత్తం తెలంగాణా రాష్ట్రం లోని 632 మండలాల పాఠశాలలకు 31,600కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని నివేదిక లో విద్యా కమిషన్ పొందు పరిచింది.
ప్రభుత్వ సౌలభ్యం కోసం ఈ మోత్తం ప్రణాళిక అమలుకు 6 ఫేస్ లుగా విభజించింది. ఫేజ్-1లో.2025-26 ఏడాదికి 100మండలాలకు 5వేల కోట్లు,ఫేజ్ -2లో 2026-27 ఏడాదికి 100మండలాలకు 5వేలకోట్లు, ఫేజ్ -3లో 2027-28 లో119 మండలాలలో 5,950కోట్లు, ఫేజ్ -4లో 2028-29ఏడాదిలో మరో119మండలాలలో 5,950కోట్లు, ఫేజ్ -5,6 కలిపి మిగిలిన 194 మండలాలకు 2029-30లో 9,700కోట్ల రూపాయలతో ప్రణాళిక పూర్తి చేయాలని కమిషన్ సూచించింది. ఈ ఏడాదికి గాను వంద మండలాల్లో అమలుకు గాను 5వేలకోట్ల ప్రణాళిక ను సిఫార్సు చేసింది. రాష్ట్ర బడ్జెట్ కు ముందే కమిషన్ నివేదిక సమర్పించినప్పటికీ బడ్జెట్ లో ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు గాను ఈ ఏడాది కేటాయించాల్సిన 5వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు సరికదా! బడ్జెట్ లో ఆ ఊసేలేదు? ఈ ఏడాది బడ్జెట్లో విద్యకు 23వేల కోట్లు కేటాయించారు. దానిలో 2వేలకోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కేటాయించారు. మరో 200కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కు కేటాయించారు. వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఖర్చులకు పోతే ఇక బడ్జెట్లో మిగిలేది “హళ్ళికి హళ్ళి, సున్నాకి సున్నా!?”
ఇట్లాంటి స్థితిలో తెలంగాణా విద్యా కమిషన్ 2025-26నుండి విద్యా కమిషన్ సిఫార్సులకు 5వేలకోట్లు ప్రణాళికేతర వ్యయంతో ఎలా ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ పూర్తి అవుతుంది? పోనీ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన 58యంగ్ ఇండియా పాఠశాలలు కు 11,600కోట్లు ఎక్కడ నుండి తెస్తారు? వాస్తవంగా ఈ58 పాఠశాలలపై పెట్టే 11,600కోట్లరూపాయల నిర్మాణ ఖర్చుతో విద్యా కమిషన్ సిఫార్సులు అమలు జరిపే పక్షంలో విద్యా కమిషన్ సూచించిన 200 మండలాల ప్రభుత్వ పాఠశాల సంస్కరణ ప్రణాళిక పూర్తి అవుతుంది.అంటే 800 తెలంగాణా ఫౌండేషన్ పాఠశాలలు,600 తెలంగాణా పబ్లిక్ పాఠశాలలు ఏర్పాటు పూర్తి స్థాయిలో అమలవుతుంది..అయితే మన పాలకులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ బడుల సంస్కరణకు పూనుకోరు!? రెసిడెన్షియల్, ఇంటిగ్రేటెడ్ లాంటి స్వల్ప సంఖ్యలో పాఠశాలలు ఏర్పరచి వాటి గొప్పతనం గురించి ఉచిత పథకాలు కలిపి పదే పదే ప్రచారం చేసుకోవడం కొరకు వినియోగించుకుంటారు. గత ప్రభుత్వం కూడా యస్సీ, యస్టీ బిసి, మైనారిటీ వర్గాలకు ప్రత్యేక గురుకులాల ను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసింది. ఏమైంది? గత పదేళ్ల కాలంలో విద్యా ప్రమాణాలు దారుణంగా దిగజారాయి.ఆసర్ నివేదిక లు కానీ,దేశ విద్యా ప్రమాణ సూచిలతో పోల్చితే దేశంలోని 29 రాష్ట్రలలోమన స్థానం 28 స్థానం అంటే ఎంత దారుణంగా వెనుక పడ్డామో అర్థం అవుతుంది. పాలకులు గ్రహించాలసింది అదే! మెజారిటీ గా ఉన్న పాఠశాలలు పట్టించుకొనకుండా ఎన్నికొత్త పాఠశాలలు ప్రారంభించినా సగటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరగవు గాక పెరగవు! కనుక తెలంగాణా విద్యా కమిషన్ సిఫార్సులు అమలు పరచడమే మన ముందు ఉన్న ఏకైక మార్గం.
తెలంగాణా విద్యా కమిషన్ రాష్ట్రంలో 19వేల ప్రాదమిక పాఠశాలలు ఉండగా అందులో 13 వేల పాఠశాలల్లో 50 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని నిర్ధారించింది. ఇక రాష్ట్రం లో ఉన్న 3,237ప్రాధమికోన్నత పాఠశాలలు,4,843ఉన్నత పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్య ఇంచుమించు అదే విధంగా ఉన్నది. తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్రం అయిన పరిస్థితి ఉంది. శిక్షణ పొంది అనుభవం గల ఉపాద్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి, విద్యార్థులు నిండుగా ఉన్న గురుకుల పాఠశాలల్లో సరైన బోధనా సిబ్బంది లేని పరిస్థితిని పాలకులు కల్పించారు. సరైన మానెటరింగ్ వ్యవస్థ లేదు. ఫలితంగా విద్యా రంగంకు కేటాయించిన నిధులు వృధా అవుతున్నాయి. ఒకే జ్ఞాన,అధ్యయన లక్ష్యం కలిగిన 40 రకాల పాఠశాలలు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో నడుస్తున్నాయి, ఇన్ని రకాల పాఠశాలలు అవసరం ప్రస్తుతం లేదు? పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం విషయంలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్నాక్స్ విషయంలో విద్యా కమిషన్ మంచి మెనూ తోపాటు ఆచరణాత్మక సూచనలే చేసింది. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం కు నిదులు విడుదల విషయంలో వారంవారం బిల్లు చెల్లించాలని ఖచ్చితమైన సిపార్సులే చేసింది. సరైన పర్యవేక్షణా లోపం వలన తెలంగాణా పాఠశాలల్లో అక్కడక్కడా ఆహారం కాలుష్యం ఏర్పడిన సంఘటనలు , విద్యార్థులు హాస్పిటల్ పాలైన సంఘటనలు బహిర్గతం అయ్యాయి. కనుక ప్రభుత్వ పాఠశాలలో సంస్కరణకు విద్యా కమిషన్ చేసిన సూచనలు నూటికి నూరు పాళ్ళు ఆచరణ యోగ్యం అయినవి. ప్రస్థుత ప్రభుత్వం కూడా ఈ సంస్కరణలు అమలు జరిగితే ప్రభుత్వ పాఠశాలలు సంస్కరించిన ఖ్యాతి దక్కడంతో పాటు,ప్రజలకు మన రాజ్యాంగం లోని 21(ఏ)అధికరణ ప్రకారం,విద్యాహక్కు చట్టం ప్రకారం నిర్బంధోచిత ప్రాదమిక విద్య 6-14 సంవతసరాల వారికి అందించిన వారమవుతాము.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను వీలైనంత త్వరగా సంస్కరించి రాష్ట్ర ప్రజల ఆశలు నిలబెట్టు కోవాలసి ఉంటుంది.విద్య కమిషన్ ఏ ఆశయంతో పట్టుదలతో ఏర్పరచారో, దాని సిపార్సుల అమలులో అంతే వేగం, ప్రభుత్వం కనపర్చాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ దిశగా అడుగులు పడగలవు. ప్రభుత్వ చిత్తశుద్ధికి కూడా నిదర్శనంగా నిలువ గలదు.కనీసం ప్రభుత్వంకు ఇన్నాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించాలనే ఆలోచనకు రావడమే ప్రశంశించాలసిన అంశం! అది ప్రభుత్వం ముందున్న బాధ్యత కూడా..కనుక తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదికను ఈ ఏడాది నుండే పూర్తి గా అమలు జరపడం ద్వారా తాను ప్రకటించుకున్న విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల సంస్కర్తగా చరిత్రలో మిగిలిపోయే ఆలోచన చేయాలి. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలలు పునర్జీవం,పునర్వైభవం పొందాలని ఆశిద్దాం!—-
-ఎన్.తిర్మల్…
సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త,
సెల్:9441864514,
ఇమెయిల్: thirmal.1960@gmail.com