పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజల ఇక్కట్లు
తెలంగాణ వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. చలి విపరీతంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారం రోజుల తర్వాత సోమవారం ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నగర శివార్లలోని మొయినాబాద్లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో పలు చోట్ల 6.5 డిగ్రీల నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో పొద్దున్నే పొగమంచు దట్టంగా కురిసే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.





