- నియమించిన మంత్రి కెటిఆర్
- పార్టీ నేతలతో మంత్రి కెటిఆర్ టెలికాన్ఫరెన్స్
- ఇక మరింత జోరుగా ప్రజల్లోకి పార్టీ…మరోమారు విజయమే లక్ష్యంగా వ్యూహం
- నిరంతరంగా ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోమారు విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వొచ్చిన కేసీఆర్..తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావటం ద్వారా ఘనమైన ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆదివారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్.. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని.. పట్టణాల్లోని డివిజన్లను కలుపుకొని పార్టీ సభ్యులతో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు.. భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున జిల్లాలకు ఇంఛార్జ్లను నియమించారు. ఈ ఇన్ఛార్జులు జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తారని వెల్లడించారు. పార్టీ నియమించిన ఇంఛార్జ్ నేతలు..
ఆయా జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక వాటి అమలుపై చర్చించాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ఈ ప్రత్యేక బృందాలు సమన్వయం చేయనున్నాయి. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక బృందాలు సమావేశం కానున్నాయి. సమావేశాలు, ప్రణాళికల అమలుపై వారితో చర్చించాలని ప్రత్యేక బృందాలను కేటీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు.33 జిల్లాల ప్రత్యేక బృందాల వివరాలు..ఇలా ఉన్నాయి.
హైదరాబాద్- సీనియర్ నాయకుడు డా. దాసోజు శ్రావణ్, మేడ్చల్ మల్కాజ్గిరి- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వికారాబాద్ -ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి – ఎమ్మెల్సీ ఎల్. రమణ, వనపర్తి, జోగులాంబ గద్వాల ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, నాగర్ కర్నూల్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి,సిద్దిపేట -పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, రంగారెడ్డి – ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డి, మెదక్ – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, నల్లగొండ- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, యాదాద్రి భువనగిరి – ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి, సూర్యాపేట – కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జగిత్యాల పార్టీ సెక్రటరీ కోలేటి దామోదర్, పెద్దపల్లి – కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, భూపాలపల్లి, ములుగు – మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్, జనగామ – ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మహబూబాబాద్-మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నిర్మల్, ఆదిలాబాద్ – ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ -మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కామారెడ్డి – ఎమ్మెల్సీ దండే విఠల్, నిజామాబాద్ -ఎమ్మెల్సీ బండ ప్రకాష్,ఖమ్మం -ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బదాద్రి కొత్తగూడెం – ఎమ్మెల్సీ భానుప్రసాద్లను నియమించారు. వీరంతా జిల్లా నేతలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళతారు.