ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్12 :స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – తెలంగాణ రాష్ట్రం వేడుకలలో భాగంగా, సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం,16 ఆగస్ట్ న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర ప్రదేశాలలో 16, ఆగస్ట్ ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.సంబంధిత గ్రామ పంచాయతీలలో, స్థానిక మున్సిపల్ వార్డులు, ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక గానం కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా ప్రదేశాలలో నోడల్ అధికారులను నియమించి, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా 16, ఆగస్ట్ ఉదయం 11.30 గంటలకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని , జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా, అత్యంత క్రమశిక్షణతో జాతీయ గీతం ఆలపించాలని ఆయన తెలిపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
గోల్కొండ కోటలో పంద్రాగస్ట్ వేడుకలు
ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ సోమేశ్ కుమార్




