రాజీవ్‌ ‌హత్యకేసు నిందితుడి విడుదలకు ‘సుప్రీమ్‌’ ఆదేశం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం
జీవితఖైదు రద్దు చేయాలంటూ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న పెరరివలన్‌ ‌పిటిషన్‌

‌న్యూ దిల్లీ, మే 18(ఆర్‌ఎన్‌ఎ) : ‌మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరరివలన్‌ ‌విడుదలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవిత ఖైదును రద్దు చేయాలంటూ దోషి పెరరివలన్‌ ‌వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎల్‌ ‌నాగేశ్వరరావు, జస్టిస్‌ ‌బిఆర్‌ ‌గవాయ్‌, ఎఎస్‌ ‌బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి, రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు బుధవారం పేర్కొన్నది. పేరారివాలన్‌ ‌క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌ ‌తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 19 ఏళ్ల వయసులోనే రాజీవ్‌ ‌గాంధీని హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన పెరరివలన్‌ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.

1991 జూన్‌ 11‌న చెన్నైలో పెరరివలన్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. రాజీవ్‌గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలు అందించిన కేసులో అతడికి జైలు శిక్ష పడింది. అనంతరం 1999లో మరణశిక్ష విధించినప్పటికీ అది రద్దయ్యింది. చివరిగా 2014లో ఆ శిక్ష జీవితఖైదుగా విధిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు చెప్పింది. ఈ హత్య కేసులో పెరరివళన్‌తో పాటు దోషులుగా తేలిన మురుగన్‌, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్‌ ‌సంతన్‌, ‌రాబర్ట్ ‌పయాస్‌, ‌జయకుమార్‌, ‌రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పెరారివాలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీమ్‌ ‌కోర్టులో పిటీషన్‌ ‌వేశారు. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్‌ ‌గాంధీ హత్య కేసులో పెరారివాలన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *