- 4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్ స్కెచ్
- కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం
- పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు విమర్శలు
జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే కేంద్రం ఎక్స్ఛేంజీలో విద్యుత్ విక్రయాలు ఆపేసిందని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఖిలాషపూర్లో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడుతూ..మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తీరు వల్ల విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే..రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందన్నారు.
ఈ దుస్థితి నుంచి బయట పడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. దమ్ముంటే..డిస్కంలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు ఎన్నెన్ని బకాయిలున్నాయనే అంశంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ది ఒకటే ఆలోచన అని.. ఈ రాద్దాంతం చేసి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచే కుట్రకు సిద్ధమయ్యాడని విమర్శించారు. ఆదివారం జరగబోయే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈసారి మునుగోడు ప్రజలంతా భాజపావైపే ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పొర్లు దండాలు పెట్టినా ఎవరూ వోటేయరని అన్నారు. మునుగోడులో ఆదివారం జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలని బండి సంజయ్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పాదాభివందనమే కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఎవరూ వోటే•యరని మండిపడ్డారు. ఈసారి మునుగోడు ప్రజలంతా భాజపావైపే ఉన్నారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.



