పాట్నా, జూన్ 28 : బీహార్ లో మరో వంతెన కూలిపోయింది ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్ పూర్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన కూలిపోయింది.బీహార్ లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనలోని కొంత భాగం బుధవారం కూలిపోయింది.
బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకుపోయినట్లు చెప్పారు. జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా.. ఇంతలోనే వంతెన కూలిపోయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే మూడో ఘటన కావడం గమనార్హం.