- ప్రగతి భవన్ ముందు బారికేడ్ల తొలగింపు….
- జ్యోతిబా పూలే ప్రజా భవన్లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్
- సెక్రెటేరియట్లో ఆంక్షలకు చెల్లు..అమీడియాకు, ప్రజలకు ప్రవేశం
- ఇంటిలిజెన్స్ ఐజిగా శివధర్ రెడ్డి… ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియామకం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సందర్భంగా తాను ప్రకటించిన ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. దొరల పాలన ముగిసిందనీ..ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతుందని నిరూపిస్తుంది. ఉపనాస్యం తర్వాత ఆరు గ్యారెంటీలు, ఒక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తూ రేవంత్రెడ్డి రెండు సంతకాలు చేశారు.
ప్రజాభవన్ ముందు బారికేడ్ల తొలగింపు….
జ్యోతిబా పూలే ప్రజా భవన్లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్
బేగంపేటలో ట్రాఫిక్ చిక్కుగా మారిన, ఇప్పటి వరకు ప్రగతి భవన్గా పేరుపొందిన ముందున్న సిఎం అధికారిక నివాసం బారికేడ్లు తొలగించారు. సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణానికి ముందే మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతో అక్కడ ప్రజలకు ఇబ్బందిగా మారిన కంచెను తొలగించారు. ప్రగతి భవన్ను ’ప్రజాభవన్’గా మార్చుతానని, సామాన్య జనాలకు సైతం ప్రవేశం ఉంటుందని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం తొలి విూడియా సమావేశంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చెప్పినట్టుగానే అడుగులు పడ్డాయి. ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అధికారులు ఎత్తివేశారు. భవనం ముందున్న బ్యారికేడ్లను తొలగించారు. జేసీబీ సాయంతో పనులు చేపట్టారు. గురువారమే బ్యారికెడ్స్ తొలగింపు పనులు పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వొచ్చే ట్రాఫిక్, అవిూర్ పేట, బేగంపేట మధ్య ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి. గత ప్రభుత్వం ఇనుప కంచె కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రగతిభవన్ ఛాయలకు ఎవరు కూడా రాకుండా ఇలా చేశారు.
సెక్రెటేరియట్లో ఆంక్షలకు చెల్లు…మీడియాకు, ప్రజలకు ప్రవేశం
రాష్ట్ర పరిపాలన ముఖ్య కార్యాలయమైన సెక్రెటేరియట్లో ఉన్న ఆంక్షలన్నీ తొలగించి అందరికీ ప్రవేశం కల్పిస్తామని చెప్పినట్లుగానే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్రెడ్డి వాటిని తొలగించి మీడియాతో సహా స్వజనులు వందలమంది వెంటరాగా సచివాలయం లోపలికి వెళ్ళారు. నూతన సచివాలయం కట్టిన తర్వాత సామాన్య ప్రజలెవరికీ ఇంతవరకు ప్రవేశం లేదు. కనీసం మీడియా ప్రతినిధులను కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. సచివాలయం ముందున్న ఒక గదిలోనే వారు కూర్చోవాల్సి ఉండేది. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే సంబంధిత శాఖ అనుమతిస్తేనే లోనికి వెళ్ళాల్సి ఉండిరది. దీంతో మంత్రులకు, సంబంధిత శాఖల సెక్రెటరీలను కలిసి తమ బాధలు చెప్పుకోవాలనుకున్న వారు అనేక ఇబ్బందులకు గురైనారు. రేవంత్రెడ్డి పార్లమెంటు సభ్యుడి హోదాలో సమాచారం నిమిత్తం సచివాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన్ను సచివాలయం సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో తాము అధికారంలోకి రాగానే ఈ ఇనుప బారికేడ్లను తొలగించి సామాన్యులకు కూడా అందులో ప్రవేశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అన్నట్లుగానే సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, ప్రజలు, మీడియా వెంటరాగా అట్టహాసంగా ఆయన సచివాలయంలో అడుగుపెట్టారు. మీడియాతో సహా అందరూ ఆయన ఛాంబర్ వరకు వెళ్ళటం గమనార్హం. కీలక పదవుల్లో మార్పులు వెనువెంటనే ప్రభుత్వంలో కీలక పదవుల్లో మార్పులకు కూడా సిఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.





