అత్యవసర విభాగం ఆధునీకరణ
తల్లికి, బిడ్డకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట
హాస్పిటల్ సౌలత్లపై అవ్వలతో ఆరోగ్య అమాత్యుడి ఆత్మీయ సంభాషణ
ఆరోగ్యం బాగైతదని భరోసాతో వొస్తున్నాం
సిద్ధిపేట జిల్లా హాస్పిటల్ వైద్య సేవలు బాగున్నాయని తెలిపిన రోగుల బంధువులు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తల్లిబిడ్డకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట. డెలివరీకై వొచ్చిన గర్భిణీకి ఆపరేషన్ చేయాలంటూ..డాక్టర్ల మీదకి కోపానికి రావొద్దమ్మా..డిశ్చార్జి కాగానే ఇంటికి పోయేటప్పుడు అవసరమైన మందులు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పునరుద్ధరణలో భాగంగా ఎమర్జెన్సీ వార్డు- క్యాజువాలిటీ, ఓపీ, ఫార్మసీలను మంత్రి ప్రారంభించారు. మునుపటి లెక్క ఉందా..ఇప్పుడు హాస్పిటల్ ఎట్లుంది అమ్మా.. అంటూ వొచ్చిన రోగులు, వారి బంధువులతో మంత్రి ఆప్యాయంగా పలకరింపులతో పరిశీలిస్తూ..ఆసక్తికరంగా సంభాషించారు. హాస్పిటల్ పునరుద్ధరణకు కృషి చేసిన వైద్య విభాగ ఇంజనీర్లను వెల్ డన్ అంటూ అభినందించారు. ఈ మేరకు దవాఖానకు వొచ్చిన వారి బంధువులతో కాసేపు ముచ్చటించారు. పలువురిని దవాఖానా బాగుందా.. వైద్య సేవలు ఏలా ఉన్నాయంటూ.. అడిగి తెలుసుకుంటూ.. ఆరా తీశారు.
నార్మల్ డెలివరీపై ఆవశ్యకత తెలుపుతూ అవగాహన కల్పించారు. తల్లికి నొప్పులు వొస్తున్నాయంటూ.. వైద్యులపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఆపరేషన్ చేసే పరిస్థితి తేవొద్దని, దానివల్ల తల్లి, బిడ్డలకు ఏర్పడే దుష్ఫలితాలు వివరించారు. మీరు ఏ ఊరు నుంచి వొచ్చారమ్మా..అంటూ మీ బిడ్డకు నార్మల్ డెలివరీ జరిగిందా..లేదా ఆపరేషన్ చేశారా..అని ఆరా తీశారు. తల్లి బిడ్డకు తిప్పలు కావద్దన్నదే తన తండ్లాటగా చెబుతూ..డెలివరీ సమయంలో ఆపరేషన్లు చేయించొద్దు.. నార్మల్ డెలివరీలు అయ్యే వరకు వేచి చూడాలని, డాక్టర్ల పైకి కోపానికి రావద్దని నిజాంపేట నుంచి వొచ్చిన పేషంట్ బంధువులకు సవివరంగా అవగాహన కల్పించారు. హాస్పిటల్ ఆవరణ ప్రాంతం కలియ తిరిగి గార్డెనింగ్, ఎమర్జెన్సీ వార్డు, ఫార్మసీ బాగుగా ఉన్నదని వైద్యాధికారుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విమలా థామస్, సూపరింటెండెంట్, ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.