రెండు స్థానాల్లో ఎందుకు పోటీ..?
పెన్షన్లు, కల్యాణ లక్ష్మి బీఆర్ఎస్ను కాపాడలేవు
బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కెసిఆర్ ప్రకటించిన లిస్ట్ చూస్తే ఆయనకు భయం పట్టుకుందని అర్థం అవుతుంది. వేరే పార్టీకి పోతరనే భయంతో వారికే టికెట్లు ఇచ్చుకున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ అన్నారు. బంజారాహిల్స్లో సోమవారం బీజేపీ మోర్చాల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…తను గతంలో మాట్లాడుతూ కొడితే కుంభస్థలం మీద కొడతా అని ఛాలెంజ్ చేసినానని.. గజ్వేల్లో పోటీ చేస్తా అన్నా.. హుజురాబాద్ ఎన్నికల్లో సైతం వాళ్ళు వీళ్లూ ఎందుకు దమ్ముంటే కెసిఆర్ నువ్వు రా లేదంటే హరీష్ నువ్వు రా పోటీకి అని సవాల్ విసిరిరానని అన్నారు. ప్రజాదరణ ఉన్నవారు, అప్రతిహతంగా గెలిచేవాడు అయితే రెండు సీట్లలో కెసిఆర్ ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తూ..అది చాలదా కెసిఆర్ భయం తెలవడానికి..అని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తన్లాడుతుంది..అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు..కెసిఆర్ ఇచ్చే పెన్షన్లు, కల్యాణ లక్ష్మి ఆయనను కాపడలేవు..అయినా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కేసీఅర్ ఇంటి నుండి ఇవ్వడం లేదు…అవన్నీ ప్రజల డబ్బులు. వారు పన్నులు కడితే వొచ్చాయి..అన్నారు. తెలంగాణ వొచ్చినప్పుడు మద్యం మీద ఆదాయం 10,500 కోట్లు అయితే ఇప్పుడు అది 45 వేల కోట్లు..పుస్తెల తాళ్ళు కట్టడానికి కల్యాణ లక్ష్మి పేరుతో 2500 కోట్లు ఇస్తే..ఆ పుస్తెలు తెంపి 45 వేల కోట్లు సంపాదిస్తున్నారు.
ఎటు పోతుంది తెలంగాణ..తెలంగాణ అంతా తాగుడు, డ్రగ్స్ మయం అయ్యి యువత నిర్వీర్యం అయిపోతుంది..తెలంగాణ సమాజం టెన్షన్, బాధలో ఉంది. .ఆ టెన్షన్ బొంబాట్ చేసే బాధ్యత బీజేపీ మీద ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన, సుసంపన్నమైన తెలంగాణ తెచ్చుకుందాం..అని ఈటల పేర్కొన్నారు. జాతుల సమస్యల ఎజెండాగా మన కుల సంఘాల మోర్చాల పోరాటం ఉండాలి..కిసాన్ మొర్చా రైతుల సమస్యల మీద గట్టిగా కొట్లాడాలి..అని పిలుపునిచ్చారు. లంబాడా మహిళ లక్ష్మినీ పోలీసులు విపరీతంగా కొట్టారనీ పేర్కొంటూ ఆమె మీద మీరు వేస్తున్న నింద నిజమే అయితే కెసిఆర్ మీరు ఒకప్పుడు చెప్పినట్లు తండాల్లో లంబాడాలు పిల్లల అమ్ముకునే స్థాయి నుండి ఒళ్ళు అమ్ముకునే స్థితికి ఎందుకు వొచ్చిందనేది కెసిఆర్ సమాధానం చెప్పాలి.
అని ఈటల అన్నారు. సమస్య నుంచి తప్పించుకోవడానికి కెసిఆర్ అభాండాలు వేస్తున్నారు.. పోడు భూముల కోసం మహిళలు అడిగితే బూటు కాళ్ళతో తన్నించిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం..అని ఆరోపిస్తూ.. కెసిఆర్ ప్రభుత్వం అనేక దుర్మార్గాలు చేస్తుంది..ఒక మహిళ నేత, మాజీ మంత్రి అయిన డికె అరుణ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు..2014 వరకు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న. ఆనాడు ఉన్న గౌరవం కూడా ఈ కెసిఆర్ ప్రభుత్వంలో లేదు. ఇలాంటి కెసిఆర్ను గద్దె దించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదన్నారు. కెసిఆర్ ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు..అసెంబ్లీ నడపడంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు..దుర్మార్గ, రాజరిక పాలన సాగుతుంది..దీనికి కూల్చకపోతే మనకు మనుగడ ఉండదు..అని ఈటల రాజేందర్ అన్నారు.



