National Congress Party జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పెద్ద సమస్యగా తయారయింది. ఈ పదవిని చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోవడంతో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అమె అస్వస్థతగా ఉండటం వల్ల అధ్యక్ష భారాన్ని మోయలేకపోతున్నది. అయితే నెహ్రూ కుటుంబ సభ్యులే ఈ పదవిని అలంకరించాలంటూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణులు పట్టు పడుతుండడంతో ఈ పదవిలో కొనసాగేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. గతంలో ఈ పదవిని బలవంతంగా అలంకరించిన రాహుల్ గాంధీ దానికి న్యాయం చేయలేకపోయానని పలుసార్లు పార్టీ అంతర్ఘత చర్చల్లో చెప్పడమే కాకుండా 2019 లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వొచ్చింది. దీంతో ఇక తాను ఎంతమాత్రం అపదవిలో కొనసాగేదిలేదని అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగాడు. అయితే నెహ్రూ వీర విధేయులైన కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితిలో ఆ పదవిలో ఆ కుటుంబ సభ్యులే కొనసాగాలని పట్టుదలతో ఉండడంతో నాటి నుండి సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగక తప్పలేదు. కాని, అనారోగ్య కారణాలతో తాను ఆ పదవిలో కొనసాగలేనని అమె పలు దఫాలు పార్టీ ముఖ్య నేతల చర్చల్లో చెబుతూ వొస్త్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కునే సత్తా రాహుల్ గాంధీకి ఉందంటూ ఆ పార్టీ నాయకులు రాహులే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వత్తిడి తేవడం ప్రారంభించారు. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు రాహుల్ అధ్యక్షపదవి చేపట్టాల్సిందేనని తీర్మానాలు చేశాయి. అందులో రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్ఘడ్, తమిళనాడు, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, బీహార్ రాష్ట్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి రాష్ట్ర అధ్యక్షుడు తాజాగా అదే డిమాండ్ చేస్తున్నారు. అయినా రాహుల్ ససేమిరా అనడంతో కాంగ్రెస్కు మార్గనిర్ధేశనం చేసే నాయకుడు కరువైనాడు. దీంతో చాలా మంది సీనియర్లు ఒక్కొక్కరిగా పార్టీని వొదిలి వెళుతుండడం ఆ పార్టీ తీవ్ర అఘాతంలోకి కూరుకుపోయింది. బిజెపి అధికారంలోకి రాక ముందు దాదాపు దశాబ్దం పాటు తిరుగులేని మెజార్టీతో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రెండంటే రెండు రాష్ట్రాలకే పరిమితమయింది. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ ఎప్పుడూ అంతర్ఘత కలహాలతో విసిగి పార్టీకి వీర విధేయులుగా ఉన్న సీనియర్ నాయకులు, యువ నాయకులు క్రమేణ పార్టీకి దూరం అవుతూ వొచ్చారు.

పార్టీ వొదిలి వెళుతున్న వారిని కనీసం అపే ప్రయత్నాలు కూడా ఆ పార్టీ వర్గాలు చేయలేకపోతున్నాయి. దీంతో పార్టీ మరింత బలహీనపడుతూ వొచ్చింది. ఈ పరిస్థితిలో కూడా రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించాలంటూ రాష్ట్ర పార్టీలు తీర్మానం చేయడం గమనార్హం. అయితే తనపైన వొస్తున్న వొత్తిడి నుండి దూరం వెళ్ళేందుకే ఇప్పుడాయన దేశ వ్యాప్త పర్యటన పెట్టుకున్నాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. భారత్ జోడో పేరిట కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలందరినీ ఏకం చేయాలని ఆయన సంకల్పించారు. సెప్టెంబర్ 7 తమిళనాడు నుండి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ జండాను రాహుల్కు అందించడం ద్వారా ఈ యాత్ర మొదలైంది. బుధవారం 14వ రోజు కొనసాగుతున్న ఈ యాత్రలో రాహుల్ వెంట 117 మంది పాదయాత్రలో పాల్గొనగా వారిలో 32 మంది మహిళలు కూడా పాల్గొనడం గమనార్హం.
150 రోజులపాటు మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల దూరం కాలినడకన నడుస్తూ దేశంలోని భిన్న ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అవగాహన చేసుకునే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, కర్షకులు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలను అప్యాయంగా పలకరిస్తూ వారు చెబుతున్న విషయాలపై ఆసక్తి కనబరుస్తుండడం అందరినీ అకట్టుకుంటుంది. ఏ రాష్ట్రంలో పర్యటిస్తున్నా ఆయన వెంట నడిచేందుకు స్థానిక ప్రజలు అమితోత్సాహం చూపిస్తున్నారనడానికి ఆయా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నవారి సంఖ్యే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సందర్భంగా ఆయన బిజెపి పాలనలో మతోన్మాదం పెరిగిపోతున్నదని, అలాగే అసమానతలు, నిరుద్యోగం, జీవన విధ్వంసం, పక్షపాత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని తన పర్యటనలో పిలుపునిస్తున్నారు.

దాంతో పాటు కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఒకటి కాగా, దిల్లీలో ఉంటే అధ్యక్ష పదవి చేపట్టాలంటూ తనపై మరింత వొత్తిడి పెంచే అవకాశాలకు దూరం ఉండాలన్న ఆలోచనతోనే రాహుల్ దేశ వ్యాప్తంగా సంచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్లు వేయాల్సి ఉంది. అక్టోబర్ 17న ఎన్నికలు జరిపేందుకు ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు రాహుల్ యాత్ర మధ్యలో దిల్లీ వెళ్తారా, లేదా తన పట్టు విడువకుండా యాత్రను అలానే కొనసాగిస్తారా అన్నది ఇంకా సస్పెన్సే. కాని పక్షంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్లలో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.




