పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్ మార్కెట్ గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్ మార్కెట్ వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్ మార్కెట్ లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది. ఆ తరువాత 2021 లో అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడడం, కోవిద్ నియంత్రణ లోకి రావడం తో తిరిగి దేశీయ మరియు విదేశీ మార్కెట్లు గాడిలో పడటం జరిగింది.
కానీ, 2022 లో రష్యా – యుక్రెయిన్ యుద్ధం తో స్టాక్ మార్కెట్ ల పరిస్థితి మళ్ళి మొదటికి రావడం జరిగింది. ఇరు దేశాల మధ్య ఘర్షణతో అంతర్జాతీయంగా సప్లై చైన్ సమస్య ఉద్భవించడం, అంతర్జాతీయంగా కమోడిటీ ల ధరలు ఆకాశానికి అందడం, ప్రపంచ మార్కెట్ లను ప్రభావితం చేసే క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం లాంటి కారణాలతో ఈక్విటీ మార్కెట్ లు భారీగా పతనమయ్యాయి. ఈ సమయంలో 13 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడం గమనార్హం. రష్యా – యుక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం కాస్త సమిసినప్పటికీ, ఇప్పుడు భారతదేశం తో పాటు, యూ. ఎస్ లాంటి దేశాలు ద్రవ్యోల్పణం అనే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.
పెరిగిన ద్రవ్యోల్పణాన్ని నియంత్రణలో ఉంచేందుకు అటు యూ ఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ లను 0.75 % నుంచి 1.00% పరిధిలోకి తెస్తున్నట్టు కమిటీ చైర్మన్ పావెల్ ప్రకటించడం తో గ్లోబల్ మార్కెట్ లు భారీగా పతనమవడం జరిగింది.
భారతదేశం లో రిజర్వు బ్యాంకు కూడా 0.40% రెపో రేట్ ను పెంచడం, ఈ పెంపు ద్రవ్యోల్పణం తగ్గేవరకూ కొనసాగుతుందని ప్రకటించడం తో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడం. ఈక్విటీ స్టాక్స్ ధరలు 12% నుంచి 15 % కంటే ఎక్కువగా క్షీణించడం తో దేశంలోని సూచీలు నష్టాల్లోకి నెట్టబడ్డాయి. డౌ జోన్స్, నాస్డాక్, 20% వరకు సవరించబడ్డాయి. భారత స్టాక్ మార్కెట్ లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ( ఎఫ్. ఐ. ఐస్ ) ప్రతిరోజు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల కూడా నిఫ్టీ నష్టాల్లో ముగుస్తుండడం జరుగుతుంది. అయితే, క్రూడ్ ధరలు బ్యారెల్ కు సుమారు 119 డాలర్ కు చేరడం, జూన్ లో ఫెడ్ మరియు ఆర్ బి ఐ వడ్డీ రేట్లు పెంచబోతుండటం ఈ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే ఆస్కారం ఉండటం తో స్టాక్ మార్కెట్ లో వోలాటిలిటీ పెరిగే ఆస్కారం ఉంది.
అయితే పెట్టుబడిదారులు మంచి కంపెనీ వాటాలు కొనడానికి ఇది మంచి అవకాశంగా భావించాలి. ట్రేడర్స్ సపోర్ట్ మరియు రెసిస్టన్స్ స్థాయిలను గుర్తించి సరి అయిన స్టాప్ లాస్ లను పెట్టుకొని ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలను ఈ పరిస్థితిల్లో కూడా ఒడిసిపట్టుకోవచ్చు.
– డాక్టర్ ఎం డి ఖ్వాజా మొయినొద్దీన్
ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
9492791387




