కడప, జూలై 8 : వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్కు నివాళులర్పించారు. శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంతకుముందు ఉదయం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయారు. పాలేరులో బహిరంగసభ లో ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ మూడు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు.