అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు

జూన్‌ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా…

ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా ఎన్నిక చెల్ల నేరదని తీర్పు వచ్చాక, ఏకపక్షంగా రాష్ట్రపతి ద్వారా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిత మయింది. ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను హరించి వేశారు. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించి వేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్‌ ‌షిప్‌ ‌ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఎన్నో పత్రికలకు నిషేధించారు.. వాటిలో కొన్ని జాగృతి (తెలుగు, హైదరాబాద్‌), ‌సృజన (తెలుగు, హైదరాబాద్‌), ‌ప్రజాసమస్యలు (తెలుగు, రాజమండ్రి), మెయిన్‌ ‌స్ట్రీమ్‌ (ఇం‌గ్లీష్‌, ‌ఢిల్లీ), జవానీ దివాని (హిందీ, ఢిల్లీ), ఆర్గనైజర్‌ (ఇం‌గ్లీష్‌, ‌ఢిల్లీ), సెమినార్‌ (ఇం‌గ్లీష్‌, ‌ఢిల్లీ), సాధన (గుజరాతి, అహ్మదాబాద్‌), ‌భూమిపుత్ర (హిందీ, బరోడా), లోకవాణి (కన్నడ, బెంగళూరు), పాంచజన్య (హిందీ, లక్నో), ఒపీనియన్‌ (ఇం‌గ్లీష్‌, ‌ముంబై) రాష్ట్ర వార్త (మలయాళం, ఎర్నాకులం), విక్రమ్‌ (‌కన్నడ, బెంగళూరు), క్వెస్ట్ (ఇం‌గ్లీష్‌, ‌ముంబై) వంటి ఎన్నో పత్రికలు నిషేధానికి గురయ్యాయి. శంకర్‌ ‌వీక్లీ లాంటి ఏకైక కార్టూన్‌ ‌పత్రిక సెన్సార్‌ ‌నిబంధనలతో ఏకీభవించ లేక మూసుకోవలసి వచ్చింది.

పత్రికలపై సెన్సార్‌ ‌షిప్‌ ఉం‌డడంతో అన్ని భాషలలోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో వందేమాతరం, ఎక్స్ ‌రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. తొలిరోజుల్లో వివిధ పేర్లతో అజ్ఞాత పత్రికలు వెలువడి నప్పటికి చివరివరకు వందేమాతరం, ఎక్స్ ‌రే.లాంటి కొన్ని పత్రికలు కొనసాగాయి. ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ ‌చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్‌ ‌గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి. అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌వంటి  సంస్థలు  ఇందిర నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చాయి. అనేక వేల మందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది.

image.png
‌ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా  వాషింగ్టన్‌ ‌పోస్ట్‌లో జర్నలిస్టుల రక్షణ కమిటీ ఫుల్‌ ‌పేజీ ప్రకటన
ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన తెలియ జేశారు. 1975 జులై 26 నుంచి పదిరోజుల పాటు వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రముఖులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమపు రెండవ అంకంలో 1975 నవంబర్‌ 14 ‌నుంచి 1976 జనవరి 26 వరకు సత్యాగ్రహాలు జరిగాయి. ప్రతివారం పది, 15మందితో అన్ని జిల్లాలు, చిన్నచిన్న పట్టణాలలో సత్యాగ్రహాలు చేశారు. అనేకచోట్ల మహిళా సత్యాగ్రహాలు కూడా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్య పరుస్తూ అరెస్ట్ అయ్యారు. అంతకుముందు 1975 ఆగస్ట్ 15‌న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అజ్ఞాత కార్యకర్తలు కరపత్రాలను పంచారు. ప్రజాస్వామ్యాన్ని ఇందిరా గాంధీ అపహాస్య పాలు చేస్తున్న వైఖరిని ఆ కరపత్రాల్లో తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఉద్యమంలో ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికి మొత్తం పోరాటం లోక సంఘర్ష సమితి (ఎల్‌ ఎస్‌ ఎస్‌) ‌పేరుమీద లోకనాయక్‌ ‌జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌నాయకత్వంలో జరిగింది.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో 23 జిల్లాలకు చెందిన సుమారు 250 మందిని -మీసా’ చట్టం కింద అరెస్ట్ ‌చేశారు. సుమారు రెండున్నర నెలలపాటు జరిగిన సత్యాగ్రహాల్లో 354 స్థలాల్లో 5వేలమంది సత్యాగ్రహం చేశారు. వీరిలో 1,655మందిని అరెస్ట్ ‌చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో డి ఐ ఆర్‌ ‌చట్టం కింద 703మందిని అరెస్ట్ ‌చేయగా వీరిలో 672మంది ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌పరివార సంస్థలకు చెందినవారే. దేశవ్యాప్తంగా మొత్తం 23 వేల మంది మీసా, డి ఐ ఆర్‌ ‌కింద అరెస్ట్ ‌చేశారు. ఒక లక్షా 54 వేలమంది సత్యాగ్రహం చేశారు. 21 నెలలపాటు మహా ఉధృతంగా సాగిన అజ్ఞాత ఉద్యమ ఫలితంగా 1977 మార్చి మూడవ వారంలో నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరా గాంధీతోసహా కాంగ్రెస్‌ ‌పార్టీకి ఘోర పరాజయం సంభవించింది. పాత కాంగ్రెస్‌, ‌భారతీయ జనసంఘ్‌, ‌లోక్‌ ‌దళ్‌, ‌సోషలిస్ట్ ‌పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ లోక్‌ ‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అంతిమంగా ప్రజాస్వామ్యం  విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *