- భారీగా మోహరించిన పోలీసులు
- సిట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సిట్ అధికారులు ఆయనను విచారించారు. అంతకుముందు.. సిట్ రేవంత్ లిబర్టీ నుంచి సిట్ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. వెంట తెచ్చుకున్న ఆధారాలతో రేవంత్ రెడ్డి.. సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. రేవంత్ రాకతో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకురాలు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లను తోసేసి సిట్ ఆఫీస్ వైపునకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో గురువారం సిట్ ఎదుట హాజరై..పేపర్ లీకేజీపై పలు ఆధారాలను రేవంత్ రెడ్డి అందించారు. హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీస్కు వెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు. ఈ క్రమంలో ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే లింగోజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ప్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్రపై విచారణ చేయకుండా… ప్రతిపక్ష పార్టీ నాయకులను విచారణకు పిలవడం ఏంటని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.