Take a fresh look at your lifestyle.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం..!

 ‘సర్వేంద్రి యానాం నయ నం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంధత్వ సమస్య ఎంత బాధాకరమో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చూడగలిగే వారికి దృష్టి విలువ అంతగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల ప్రజలు పలు రకాల దృష్టి సమస్యలతో సతమతం అవుతూ ఉండగా, వారిలో దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు శాశ్వత అంధత్వంతో బాధ పడుతున్నారని, అందులో అత్యధికంగా 10 మిలియన్లకు మించి ఇండియాలోనే అంధత్వ బాధితులు ఉన్నారనే విషయం భారతీయులను కలచి వేస్తున్నది. ఇండియాలో రాజస్థాన్‌, ‌మధ్య ప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో అంధుల జనాభా అధికంగా ఉన్నది. అంధత్వ నివారణ పట్ల సామాన్య జనంలో అవగాహన కల్పించడం, వైద్య సదుపాయాలు నెలకొల్పడం, అంధుల విద్యాలయాలు నెలకొల్పడం, హక్కుల పరిరక్షణ, నేత్రదాన ఉద్యమాలు, అంధులకు ఉద్యోగ ఉపాధుల్లో సమాన అవకాశాలు కల్పించడం లాంటి అంశాలను చర్చించే వేదికగా భారత ప్రభుత్వం 01 నుండి 07 ఏప్రిల్‌ ‌వరకు ‘అంధత్వ నివారణ వారం’ నిర్వహిస్తున్నది.
అంధత్వ నివారణ ప్రయత్నాలు :
1960లో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ప్రారంభించిన అంధత్వ నినారణ వారం సందర్భంగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉచిత కంటి పరీక్షల శిబిరాలు, ప్రచార సామాగ్రి వినియోగాలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. నేత్ర ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ సమాజం 08 అక్టోబర్‌న ‘ప్రపంచ దృష్టి దినం’, 07 నుంచి 13 మార్చి వరకు ‘ప్రపంచ గ్లకోమా వారం’, అక్టోబర్‌ ‌మాసాన్ని ‘అంధత్వ అవగాహన మాసం’గా నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. భారత ప్రభుత్వం అంధుల విద్య కోసం ప్రత్యేక విద్యాలయాలు నెలకొల్పినప్పటికీ మరి కొంత దృష్టి పెట్టడం అవసరం ఉంది. అంధత్వంతో ఇమిడి ఉన్న పలు సమస్యలకు పరిష్కారాలు అన్వేసించే క్రమంలో ప్రభుత్వాలు, స్యచ్ఛంధ సంస్థలు, అంధత్వ సంబంధ విభాగాలు సమన్వయంతో పని చేయాల్సి ఉంది. నేత్ర సమస్యలను పరిష్కరించడానికి తరుచుగా నేత్ర పరీక్షలు చేయించుకోవడం, అంధత్వం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరగాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘కంటి వెలుగు పథకం’ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 18 జనవరి 2024న చేపట్టిన ‘కంటి వెలుగు’ 2వ విడత పథకం ద్వారా రాష్ట్రం నుంచి. నివారించగల అంధత్వాన్ని (ప్రివెంటబుల్‌ ‌బ్లైండ్‌నెస్‌) ‌తరిమే లక్ష్యంతో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా 1,473 పట్టణ వార్డులు, 4,089 గ్రామపంచాయతీల ద్వారా మార్చి 06, 2023 వరకు 66 లక్షల మంది (31 లక్షల పురుషులు, 35 లక్షల స్త్రీలకు నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, ఔషధాలు, ఇతర సాధారణ చికిత్సలు చేస్తున్నారు. దేశంలోనే తనదైన ప్రత్యేక ప్రజాహిత కార్యక్రమంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ ద్వారా అందరికి ఉచిత కంటి పరీక్షలు (యూనివర్సల్‌ ఐ ‌స్క్రీనింగ్‌) ‌నిర్వహించడం, ఉచితంగా కంటి అద్దాలను వితరణ చేయడం, నేత్ర చికిత్సలో భాగంగా ఔషధాలను అందించడం, నేత్ర సంబంధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయడం లాంటి ఉచిత సేవలను అందిస్తున్నారు.
తొలి విడత ‘కంటి వెలుగు పథకం-1’ ఆగష్టు 15, 2018న ప్రారంభమై 106 కోట్ల ఖర్చు చేసిన పిదప విజయవంతంగా ముగిసింది. కంటి వెలుగు పథకంలో భాగంగా వక్రీభవన చూపు లోపం, కంటి శుక్లాలు, విటమిన్‌ ఏ ‌లోపం, కంటి ఇన్ఫెక్షన్లు, గ్రాకోమా, కార్నియల్‌ ‌డిజార్డర్‌, ‌డయాబెటిక్‌ ‌రెటినోపతి జబ్బులకు ఉచిత చికిత్సలు కల్పించడంతో గ్రామీణ/పట్టణ ప్రాంత నిరుపేదలు అధికంగా లాభపడ్డుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మెడికల్‌ ఆఫీసర్‌, 2/3 ‌యంపిహెచ్‌యస్‌, 1/2 ఆప్టోమెట్రిస్టులు, 2/3 ఆశా వర్కర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌సిబ్బందితో పాటు నేత్ర పరీక్షలకు కావలసిన వైద్య పరికరాలు, మెటీరియల్స్, ఔషధాలు అందుబాటులో ఉంచారు.
అంధత్వం వర్గీకరణ – నివారణ చర్యలు:
అంధత్వం మూడు రకాలుగా కనిపిస్తుంది. వీటిలో ట్రకోమా (శుక్లపటలమునకు సోకిన అంటురోగం), కాటరాక్ట్ (‌కంటి శుక్లాలు), విటమిన్‌-ఏ ‌పోషకాహారలోప అంధత్వం వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ‘రైట్‌ ‌టు సైట్‌ (‌దృష్టి హక్కు)’ నినాదంతో అంధత్వ నివారణ చర్యలు తీసుకుంటున్నది. విటమిన్‌-ఏ ‌పోషకాహారలోపంతో జనించే అంధత్వం నివారించ తగినదే అని ప్రభుత్వాలు, పౌర సంఘాలు గుర్తించాలి. కంటి ఆరోగ్య పరిరక్షణ, నేత్ర రుగ్మతల చికిత్సలు, దృష్టి దోషం కలిగిన మేధావుల విజయ గాథలు, నేత్ర ఆరోగ్య పరిరక్షణ పరిశోధనలు, స్వచ్ఛంధ సంస్థల బాధ్యతాయుత సేవలు లాంటి అంశాల్లో శ్రద్ధ వహించుటతో అంధత్వ సమస్యను తగ్గించవచ్చు.
గాలి కాలుష్యం అతిగా పెరిగితే నయం చేయలేని అంధత్వం కూడా వస్తుందని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాతీయ అంధత్వ నిర్వహణ కార్యక్రమం వివరాల ప్రకారం 62.6 శాతం కాటరాక్ట్, 19.70 ‌శాతం రిఫ్రాక్టివ్‌ ఎ‌ర్రర్‌, 0.90 ‌శాతం కార్నియల్‌ ‌బ్లైండ్‌నెస్‌, 0.90 ‌శాతం పిసిఓ, 4.70 శాతం పియస్‌డి మరియు 4.19 శాతం ఇతర కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 0.80 మంది కంటి సమస్యలను కలిగి ఉన్నారని అంచనా. గ్లకోమా, కంటి శుక్లాలు, కండ్ల కలకలకు వైద్యం సకాలంలో అందితే అంధత్వం నివారించబడుతుంది.
దృష్టి పరిరక్షణకు ముందు జాగ్రత్తలు:
కంప్యూటర్‌, ‌సెల్‌ఫోన్‌ ‌స్క్రీన్‌ ‌చూసే సమయాలను తగ్గించడం, తరుచుగా నేత్ర పరీక్షలు చేయించుకోవడం, కంప్యూటర్‌ ‌పనిలో ప్రతి 2 గంటలకు ఒకసారి విరామం తీసుకోవడం, వైద్యుల సలహాలతో నీలికాంతి నుంచి రక్షణ అద్దాలను వాడడం, నిత్యం విటమిన్‌-ఏ ‌కలిగిన పోషకాహారాన్ని తీసుకోవడం లాంటి జాగ్రత్తలను తీసుకోవాలి. అంధత్వ సమస్యల్లో 80 శాతం నివారించదగినవే ఉన్నాయి. వయస్సు 50 ఏండ్లు దాటిన వారిలో దృష్టి సమస్యలు అధికంగా కనిపిస్తాయి. నేత్ర గాయాలు, దృష్టి దోషాలను నివారించడం, నయం చేయడం మరియు చికిత్సలు అందుబాటులో ఉంచడం ముఖ్యమని గమనించాలి. భారత్‌లో నివారించదగిన పోషకాహార లోప, ట్రాకోమా, కాటరాక్ట్ ‌నేత్ర సమస్యలు అధికంగా కనిపిస్తాయి.
 నేత్రదాన ప్రతిజ్ఞ :
మరణానంతరం నేత్రదానం చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన రెండు నేత్రాల దానంతో మరో ఇద్దరు అంధులకు చూపు లభిస్తుందని, మరణానంతరం కూడా మన కళ్ళు సజీవంగా ఉండగలవనే సద్భావన కలిగి ఉందాం. అంధత్వ నివారణ యజ్ఞంలో పాలుపంచుకుందాం.

image.png

  డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply