Take a fresh look at your lifestyle.

సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కార్యాలయం ముట్టడి

  • టిఎస్‌పిఎస్‌సి పేపర్‌ ‌లీకేజిపై విద్యార్థి సంఘాల ఆందోళన
  • చిక్కడపల్లిలో నిరుద్యోగుల నిరసన
  • మద్దతు ప్రకటించిన ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌

‌హైరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్ల లీకేజీ వ్యవహారంపై బిజెపి అనుబంధ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఆఫీస్‌ ‌ముట్టడికి విఫలయత్నం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్‌ ‌చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ విద్యార్థులు  భగ్గుమన్నారు. ఎగ్జామ్‌ ‌పేపర్లను అమ్ముకుంటూ.. నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఆఫీస్‌ ‌బోర్డును పీకేశారు.. గేట్లు దూకారు.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు లాక్కెళ్లారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే.. పేపర్లు లీక్‌ ‌చేసి మోసం చేస్తున్నారని.. అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్. ‌

పేపర్‌ ‌లీకేజీలు ప్రగతిభవన్‌ ‌డైరెక్షన్‌ ‌లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు.. ఇంజినీరింగ్‌ ‌విభాగంలోని టౌన్‌ ‌ప్లానింగ్‌ ఎగ్జామ్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌తరహాలోనే.. గ్రూప్‌ ‌వన్‌, ఇతర కాంపిటీషన్‌ ఎగ్జామ్స్ ‌పేపర్లు కూడా లీక్‌ ‌చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేసారు. పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ ‌కను సన్నల్లోనే టీఎస్పీఎస్సీలో పేపర్‌ ‌లీకైందని ఆరోపించారు. ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆందోళన చేస్తున్న  బీజేపీ విద్యార్థుల సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరోవైపు టీఎస్పీఎస్సీలో పేపర్‌ ‌లీకేజీపై నిరుద్యోగులు రోడ్డెక్కారు.హైదరాబాద్‌ ‌చిక్కడపల్లిలోని సెంట్రల్‌ ‌లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగారు. తిండి తిప్పలు మానేసి కష్టపడి చదివినా తమకు ఉద్యోగం రాలేదని..అలాంటి ప్రవీణ్‌ అనే వ్యవక్తికి వందకు పైగా మార్కులు రావడమేంటని ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. పకడ్బందీగా ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీసులో పెన్‌ ‌డ్రైవ్‌ ‌ద్వారా పేపర్‌ ‌కాపీ చేయడం అంత ఆశామాషీ కాదని..ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైందని ఆరోపించారు. నిర్వహణ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. టీఎస్పీఎస్సీ  ఛైర్మన్‌ ‌బి జనార్థన్‌ ‌రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీకి అటాచ్‌ ‌చేయాలన్నారు. గ్రూప్‌ 1 ‌పేపర్‌ ‌కూడా లీకైనట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేసారు. గ్రూప్‌ 1 ‌పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కూడా లీకేజీతోనే ఫెయిలయ్యామా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ 16‌న గ్రూప్‌ 1 ‌పరీక్ష జరిగింది. 2.86 లక్షల మంది గ్రూప్‌ 1 ‌పరీక్ష రాయగా…1:50 నిష్పత్తిలో 25వేల 50 మంది క్వాలిఫై అయ్యారు. నిరుద్యోగుల ఆందోళనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు మాజీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళన న్యాయసమ్మతమైందన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్‌ ‌లీకేజీ వ్యవహారం హేయమైందని చెప్పారు. దీనిపై విచారణ జరగాలన్నారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. న్యాయం జరిగే వరకు నిరుద్యోగులంతా కలిసి పోరాడాలని సూచించారు.

Leave a Reply