ముంబై, మార్చి 28 : సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ రాహుల్ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్పకుంటే ఆయనపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. వీర్ సావర్కర్ను అవమానపరచేలా రాహుల్, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. క్షమాపణ చెప్పడానికి బదులు, రాహుల్ పదేపదే ఈతరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రంజిత్ సావర్కర్ అన్నారు. ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు సావర్కర్పై కాంగ్రెస్ మౌత్పీస్ కించపరచే వ్యాఖ్యలు చేసిందని, ఇదే విషయాన్ని ఉద్ధవ్ థాకరే దృష్టికి తీసుకువెళ్లానని, శివసేన భాగస్వామ్య పార్టీ నేత రాహుల్ గాంధీ చేత క్షమాపణ చెప్పించాలని కోరానని చెప్పారు. అయితే, ఉద్ధవ్ కూడా చేసిందే లేదని అన్నారు. దాదర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే తాను రెండు ఫిర్యాదులు నమోదు చేశానని రంజిత్ సావర్కర్ తెలిపారు.
ఐదేళ్ల క్రితం వీడీ సావర్కర్ను దేశద్రోహి అని రాహుల్ పిలిచారని, దానిపై రాహుల్కు నోటీసు పంపాలని పోలీస్ స్టేషన్కు కోర్టు ఆదేశాలిచ్చిందని అన్నారు. భారత్ జోడో యాత్రలోనూ సావర్కర్పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. సావర్కర్ పేరు పదేపదే కించపరచకుండా సమస్యకు పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కోర్టుల ద్వారా పరిష్కారం కోరతామన్నారు. బ్రిటిష్ పాలకుల ముందు సావర్కర్ క్షమాపణ చెప్పాడనటానికి ఆధారాలు లేవని రంజిత్ సావర్కర్ వివరించారు. లండన్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతారా అని ఈనెల 25న రాహుల్ గాంధీని డియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తాను సావర్కర్ను కాదని, తన పేరు గాంధీ అని, ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని అన్నారు. సావర్కర్ పేరును రాహుల్ ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.