తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్ పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారని అన్నారు. ఈ విధానం ప్రవేశ పెట్టడంతో భక్తులకు త్వరగతిన గదులు లభిస్తున్నాయని తెలిపారు.
సర్వదర్శనం భక్తులకు ఈ విధానం ద్వారానే ఉచిత లడ్డు టోకెన్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపునకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.