Take a fresh look at your lifestyle.

వయోవృద్ధులు..దివ్యాంగులకు ఇంటినుంచే వోటు

  • ఎన్నికల అధికారి సమక్షంలో ఇంట్లోనే వోటేసే సౌకర్యం
  • మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్‌

న్యూ దిల్లీ, మార్చి 29 : దేశంలో తొలిసారి ఇంటి నుంచే వోటు హక్కు వినియోగించుకునే విధానాన్ని  కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. కర్నాటక రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వారు.. దివ్యాంగులకు మాత్రమే ఈ అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయని.. అంతా పారదర్శకతతో ఉంటుందని.. ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారు.. దివ్యాంగులు పోలింగ్‌కు ఐదు రోజుల ముందే ఫారం 12 డి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం బృందాలు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? కాదా..? అనేది సరి చూసుకుంటారు. అర్హులు అని నిర్థారించుకున్న తర్వాతే..

పోలింగ్‌ ‌జరిగే రోజు ఫారం 12డి తీసుకుని.. ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. ఓటు వేసే సమయంలో పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పక్రియ మొత్తాన్ని వీడియో సైతం తీస్తారు. ఓటు ఎవరికి వేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. పోలింగ్‌ ‌సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. పోలింగ్‌ ‌బూత్‌ ‌లో ఎలాంటి పక్రియ అయితే జరుగుతుందో.. అదే తరహాలోనూ ఇంట్లోనే వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చు. కర్నాటక రాష్ట్రంలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 12 లక్షల 15 వేల మంది ఉండగా.. 5 లక్షల 55 వేల మంది దివ్యాంగులు ఉన్నారు. వీళ్లందరికీ ఇంటి నుంచి ఓటు వేసే హక్కు కల్పిస్తోంది ఎన్నికల సంఘం. ఇంటి నుంచి ఎవరెవరు ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఎంత మందికి ఓటు హక్కు కల్పించామనేది వంటి ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారం ఇస్తారు.

Leave a Reply