- జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం
- ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
- దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మానవత్వానికి మారు పేరు సీఎం కేసీఆర్ అని హరీష్రావు కొనియాడారు. ఉస్మానియా హాస్పిటల్లో మూడు పూటలా భోజనం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు వి•డియాతో మాట్లాడుతూ…రాష్ట్రం వొచ్చిన తొలి రోజుల్లోనే పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికే అందించారని మంత్రి తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఎంత మంది ఉన్న ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున.. మొత్తం 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి 200 గ్రాముల చొప్పున ఆహారం అందించేవారు. అర్దాకలితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ అన్ని హాస్టళ్లలో సన్నబియ్యం తో తిన్నంత భోజనం పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ గతంలో హాస్పిటళ్లను సందర్శించినప్పుడు రోగుల సహాయకుల బాధలను గమనించారు.
తద్వారా రోగుల సహాయకులకు ప్రభుత్వ హాస్పిటళ్ల వద్ద నైట్ షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. ఆ పని కొన్ని చోట్ల పూర్తయిందన్నారు. రోగుల సహాయకులకు కూడా భోజనం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే రోజుకు 20 వేల మందికి రూ. 5 కే అన్నం పెట్టే కార్యక్రమం ఇవాళ ప్రారంభమైందని, హరే రామ హరే కృష్ణ సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రతి భోజనం వి•ద రూ. 21 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో ఈ కార్యక్రమానికి రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఒక వేళ ఖర్చు పెరిగినా కూడా ప్రభుత్వం భోజనం పెట్టేందుకు వెనుకాడదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా హాస్పిటల్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని మంత్రి తెలిపారు. ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ కోసం రూ. 6 కోట్లను మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు.
ఆధునీక మార్చురీగా తయారు చేస్తామన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో కొత్తగా 75 ఐసీయూ పడకలు మంజూరు చేశామని, అందులో 40 ఐసీయూ పడకలను ప్రారంభించా మన్నారు. ఈ పడకలను జనరల్ మెడిసిన్, అనస్థీషీయా విభాగాల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బెడ్కు వెంటిలేటర్, మానిటర్ ఏర్పాటు చేశాం. ఇదే ఐసీయూ బెడ్లకు ప్రయివేటులో అయితే రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు ఛార్జీ వేస్తారు.. కానీ ఉస్మానియాలో మాత్రం ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మరో 30 పడకలకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లోనే ప్రారంభింస్తామన్నారు. వీటితో పాటు మరో రూ. 36 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. ఆర్థోపెడిక్ విభాగాన్ని రూ. 2 కోట్ల 63 లక్షలతో ప్రారంభించామన్నారు. రూ. 70 లక్షలతో పూర్తి చేసిన మైనర్ ఆపరేషన్ థియేటర్ను పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు. రూ. మూడున్నర కోట్లతో ఐసీయూ బెడ్స్ ప్రారంభించాం. ఓపీ రిజిస్టేష్రన్, ఫార్మసీ బ్లాక్ను కూడా ప్రారంభించామన్నారు.
హెచ్ఎండీఏ సహకారంతో గేటు, పరిసరాలను తీర్చిదిద్దడానికి రూ. 50 లక్షలతో శంకుస్థాపన చేశాం. రెండు నెలల్లో పూర్తవుతుందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని లబ్దిదారులకు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో మాత్రమే బీసీ, ఎస్సీ హాస్టల్స్ లలో సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు. వృద్దులకు రూ.2016పెన్షన్ ఇస్తున్నామన్నారు. పెళ్లి సమయంలో ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. హాస్పిటళ్లలో పేషెంట్లకు డైట్ చార్జ్ కూడా పెంచామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్ సహాయకులకు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని హో శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి కూడా రోగులు, వారి సహాయకులు ప్రభుత్వ హాస్పిటళ్లకు వస్తున్నారని, వీరంతా కేవలం రూ.5కే భోజనం చేయవచ్చన్నారు.