- వేలాదిగా తరలి వొచ్చిన కార్యకర్తలు…జనసంద్రంగా మేడారం
- కిలోమీటర్ల మేర కొనసాగిన కాన్వాయ్…మొదటి రోజు విశేష స్పందన
- కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన యాత్ర
- ఉనికిని చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క
- సీఎం రేవంత్..అంటూ యువకుల నినాదాలతో మారుమోగిన మేడారం
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఇటీవల పార్టీ ఏ కార్యక్రమానికి కనిపించని రీతిలో వేలాదిగా కార్యకర్తలు హాజరై రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. మొదటి రోజు యాత్ర సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనుకున్న సమయానికి మూడు గంటల ఆలస్యంగా రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధిలో యాత్రను ప్రారంభించాల్సి ఉండగా దారి పొడవునా కార్యకర్తల నీరాజనాల కారణంగా సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు రేవంత్ మేడారం చేరుకున్నారు. సుమారు గంటసేపు మేడారం వనదేవతల సన్నిధిలో రేవంత్ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా మేడారం మహాజాతర ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు ప్రత్యేక పూజలు జరిపించారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేశారు. దాదాపు గంటసేపు తల్లుల సేవలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి మూడు గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. మేడారం నుంచి నార్లాపూర్ మీదుగా ప్రాజెక్టు నగర్ వరకు పాదయాత్ర కొనసాగింది. అక్కడ కార్యకర్తలకు భోజన వసతి కల్పించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గంటసేపు విశ్రాంతి తీసుకున్నారు. అంతకుముందు ఉదయం ఇంటి నుండి బయలుదేరిన రేవంత్ రెడ్డి యాత్ర భారీ కాన్వాయితో ప్రారంభమైంది. సుమారు వంద వాహనాల్లో కాన్వాయ్ ములుగు జిల్లా కేంద్రానికి చేరుకునేసరికి ఒంటి గంట అయింది. ముందు రేవంత్ రెడ్డి ములుగులోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. గట్టమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా తాడ్వాయికి, తాడ్వాయి నుండి నేరుగా మేడారంకు చేరుకున్నారు. రేవంత్ రాకకు ముందే నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు ఆయన కోసం గంటల తరబడి వేచిచూసారు. రేవంత్ పాదయాత్ర కొరకు ఎమ్మెల్యే సీతక్క ఏర్పాట్లు పూర్తి చేశారు.
రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర నాయకత్వం పాల్గొనగా కార్యకర్తల్లో జోష్ నింపింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్ని తానై మొదటి రోజు పాదయాత్ర సక్సెస్ చేశారు. జన సమీకరణలోను ముందంజలో ఉండి ఆమె ఉనికిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం..రేవంత్..సీఎం..రేవంత్.