రెండవసారి ఓడిపోతే ఇక ఇంతే..!

రెండవసారి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ఎవరైనాసరే అతనికి మరోసారి పార్టీ టికెట్‌ ఇచ్చేదిలేదని కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్మానించడంతో దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుల్లో గుబులు మొదలయింది. వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్‌ ‌కష్టమేనని ఇప్పటికే పార్టీని వదిలి పెట్టినవారు పోగా, ఎప్పటికైనా పార్టీ మెరుగు పడకపోతుందా అని ఎదురుచూస్తున్న వారికి పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న చర్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

రానున్న సారస్వత ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని విజయపథాన నడిపేందుకు అధిష్టాన వర్గం పలు మార్పులు చేర్పులను చేస్తున్నది. తాజాగా రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులను హెచ్చరించిన విధానం ఇక్కడి నాయకులకు కొరుకుడు పడకుండా పోయింది. హైదరాబాద్‌ ‌బిర్యాని, చాయ్‌ ‌బాగుందని రాజధానికే పరిమితమై కూర్చుంటే లాభం లేదనడం వెనుక పార్టీ నాయకులు క్షేత్రస్థాయి కార్యక్రమాలను చేపట్టకుండా గాంధీ భవన్‌కు పరిమితమవుతున్నారన్నట్లుగా చేసిన విమర్శ నాయకులను ఇబ్బందిలో పడేసింది. ఈ కామెంట్‌ ‌తమగురించే అన్నట్లుగా ఎవరికి వారు తేలుకుట్టిన దొంగలా మారారు. అంతటితోనే ఆగకుండా రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఓడిపోయిన నేతలకు ఇక పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదని ఆయన కరాఖండీగా చెప్పడంతో వారిలో మరింత దిగులు మొద)యింది.

చాలా మంది సీనియర్లలో ఇప్పటికే రెండు మూడు సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైనవారు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్‌ ‌కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అందుకుగాను వారి నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా అధిష్టానవర్గం మెప్పు సంపాదించుకునేందుకు ప్రయాసపడుతున్నవారున్నారు. రాహుల్‌గాంధీ ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటన చేశాడో అప్పుడే వారి గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది. దశాబ్దాలుగా పార్టీలు మారకుండా కాంగ్రెస్‌నే పట్టుకుని ఉండి, పార్టీలో తమ నియోజకవర్గాల్లో మంచి పేరు సందపాదించుకుని కూడా ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తున్న వారికిది మింగుడు పడకుండా పోతుంది. దీనిపైనే ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌సమావేశంలో ‘ఉదయపూర్‌ ‌డిక్లరేషన్‌’ ‌పేర కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన తీర్మానాలు మరింత నాయకుల్లో మరింత దిగులును కలిగించేవిగా ఉన్నాయి.

కుటుంబ పాలన అంటూ నిరంతరం టిఆర్‌ఎస్‌ను తిట్టిపోస్తున్న కాంగ్రెస్‌ ‌ముందుగా తన పార్టీలో అలాంటి విధానం లేకుండా చూడాలన్న నిర్ణయానికి వొచ్చినట్లుంది. అందుకే ఉదయ్‌పూర్‌ ‌డిక్లరేషన్‌లో ‘ఒక కుటుంబం ఒకే టికెట్‌’ అం‌టూ డిక్లేర్‌ ‌చేసింది. దీనిపైన కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. తమతో పాటు తమ కుటుంబానికి సంబంధించి కొడుకులో, కూతుళ్ళో, అల్లుళ్ళో, తమ్ముళ్ళో ఎవరికైనా తమ పలుకుబడితో టికెట్‌ ఇప్పించుకోవాలనుకుంటున్న వారి ఆలోచనకు ఉదయ్‌పూర్‌ ‌డిక్లరేషన్‌ ‌బ్రేక్‌ ‌వేసినట్లు అయింది. అయితే అది రాజకీయ కుటుంబమై కనీసం అయిదేళ్ళ పాటు పార్టీ పరంగా కార్యక్రమాలు చేసిన వారు ఎవరైనా ఉంటే వారికి రెండవ టికెట్‌ ‌కేటాయించే అవకాశాలున్నాయంటూ కాస్త మినహాయింపు ఇచ్చారు. దీంతో తమ కుటుంబ వ్యక్తులకు టికెట్‌ ఇప్పించుకోవాలని చూస్తున్న సీనియర్‌ ‌నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌మల్లు బ్రదర్స్, ‌జగ్గారెడ్డి, కోమటిరెడ్డి కుటుంబాలవారికి కొంత ఊరటనిచ్చినట్లు అయింది.

భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలాకాలంగా రాజకీయాల్లో ఉండి, వివిధ పదవులు అనుభవించిన వారున్నారు. దురదృష్ట వశాత్తు పార్టీ అధికారం కోల్పోవడంతో వారిప్పుడు పదవుల్లో లేకపోయినా ఇంకా తమ నియోజకవర్గాల్లో చురుగ్గానే పనిచేస్తున్నవారున్నారు. అలాంటి వారి పరిస్థితిలో టికెట్ల కేటాయింపుకు ప్రామాణికం ఏమిటన్న విషయంలో కూడా ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏదిఏమైనా రానున్న సారస్వత ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే అభ్యర్థులను ఎంపికచేసుకునే కార్యక్రమాన్ని పార్టీ చేపట్టినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో గతంలో ఎవరు ఏ నియోజకవర్గం నుండి ఎన్నిసార్లు పోటీచేశారు. ఎన్ని వోట్ల తేడాతో ఓడిపోయారన్న లెక్కలు ఇప్పటికే సేకరించిన్నట్లు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌ ‌తన పూర్వ స్థితికిరావాలన్న ఆకాంక్షతో ఉంది. అందుకే ఈసారి ఎన్నికల వ్యూహకర్త సలహాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తున్నది. వ్వూహకర్త సునీల్‌ ‌సూచనల మేరకే రాహుల్‌పై ప్రకటనలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే పై కండీషన్లతో పార్టీలో అనుభవమున్న సీనియర్‌ ‌నాయకులను పక్కకు పెడితే పార్టీ ఎలా గట్టెక్కుతుందన్నది కూడా ఇప్పుడు పార్టీకి ప్రధాన సమస్యగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page