Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతుంది. మార్చి మాసాంతంతో పెరిగిన ఎండల తీవ్రతతో పాటు రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్‌ ‌నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్‌ ‌వినియోగం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ ‌వినియోగంలో దక్షిణాదిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మార్చి 14వ తేదీన మంగళవారం ఉదయం 10:03 గంటలకు 15,062 మెగావాట్ల విద్యుత్‌ ‌వినియోగం జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు వెల్లడించిన సంగతి తెలిసిందే.

సరిగ్గా రెండు వారాల తర్వాత గురువారం ఉదయం 11:01 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్‌ ‌వినియోగం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్‌ ‌డిమాండ్‌ ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ ‌డిమాండ్‌లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేశారు.

గత సంవత్సరం మార్చి నెలలో అత్యధికంగా 14,160 మెగా వాట్ల విద్యుత్‌ ‌వినియోగం జరిగింది. గత డిసెంబర్‌లో ఈ రికార్డును అధిగమిస్తూ 14,750 మెగావాట్ల ఫీక్‌ ‌విద్యుత్‌ ‌వినియోగం జరిగింది. కాగా తాజాగా గురువారం 15,497 మెగావాట్ల విద్యుత్‌ ‌వినియోగమైంది. మార్చి నెలలో 15వేల మెగా వాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌నమోదవుతుందని ముందే ఊహించామని సీఎండీ ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ అం‌తరాయం లేకుండా సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగా వాట్లకు పైగా డిమాండ్‌ ఏర్పడవచ్చని అంచనా వేశారు. ఎంత డిమాండ్‌ ‌వొచ్చినా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ ‌సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Leave a Reply