- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి..
- బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాలి..
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం బాలిక స్వగ్రామం మైలాపురం వెళ్లి కుటుంబాన్ని ఐద్వా బృందం పరామర్శించింది. అనంతరం మల్లేపల్లి కోదాడ హైవేపై జరిగిన భారీ రాస్తారోకోను ఉద్దేశించి ప్రభావతి మాట్లాడుతూ.. గుర్రంపూడ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికను నమ్మబలికించి కారులో ఎక్కించుకొని అంగడిపేటలోని వస్త్ర దుకాణం లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
బాధిత బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సత్వరమే శిక్షలు పడే విధంగా చూడాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాలని కోరారు. మైనర్ బాలిక హత్యాచారాన్ని గురై 24 గంటలు దాటిన మహిళా కమిషన్ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. సత్వరమే మహిళా కమిషన్ చైర్మన్ బాధిత కుటుంబాన్ని సందర్శించి భరోసా కల్పించి ప్రభుత్వం ద్వారా రావలసిన ఎక్స్ గ్రేషియా అందించటకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిమ్మల పద్మ, నాయకులు కామేశ్వర్, పెరిక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.