- హవాలా మార్గంలో డబ్బు తరలింపు
- విచారణకు రంగంలోకి దిగనున్న ఈడీ
- మూడోరోజూ కొనసాగిన సిట్ దర్యాప్తు
- టిఎస్పిఎస్సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి తొలుత బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది. సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది. కాగా ప్రవీణ్ పెన్డ్రైవ్లో మొత్తం 6 పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్నాపత్రాలను సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిలు వాటిని లీక్ చేసి లక్షల సొమ్మును వెనకేసుకున్నారు.
టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్దారణ అయింది. కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ఏఈ ప్రశ్నపత్రాన్ని తన స్నేహితురాలు రేణుకకు రూ.10 లక్షలకు అమ్మాడు. ఆ తర్వాత రేణుక, ఆమె భర్త డాక్యానాయక్ దాన్ని మరో ఐదుగురికి అమ్మి రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన లావాదేవీలు ఇంకా తెలియరాలేదు. ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతుందని సమాచారం. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై ఈడీ దృష్టి పెట్టిందని అంటున్నారు. డబ్బులన్నీ హవాలా మార్గంలో జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది.
సిట్ దర్యాప్తు జరిపిన పత్రాలను కోర్టు నుంచి తీసుకునే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తుంది. సిట్ అదుపులో ఉన్న నిందితులను విచారిస్తే హవాలా లావాదేవీల గురించి బయటపడే అవకాశం ఉంది. మరోవైపు పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ముగ్గురు నిందితులను సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్కి తరలించారు పోలీసులు. నిందితులు శవి•మ్, సురేష్, రమేష్లను మూడోరోజు సిట్ విచారిస్తుంది. గురువారం ముగ్గురు నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎల్బీనగర్, ఉప్పల్, సైదాబాద్లో నిందితులను తీసుకెళ్లి విచారించారు. గ్రూప్ 1కి సంబంధించిన మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
టిఎస్పిఎస్సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్
పేపర్ లీకేజీ కేసులో టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. బోర్డులో ఔట్ సోర్సింగ్ నియామకాలపై దృష్టి సారించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో శుక్రవారం బోర్డు సెక్రెటరీ, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా బోర్డు సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై మెంబర్లను విచారించనుంది. ఈ విచారణలో ఆరుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారిలను సిట్ విచారించనుంది.