కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు
రాష్ట్రానికి మరిన్ని ప్రోత్సహాకాలు అందించాలి
4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించండి.
కుసుం-ఎ పథకం కింద మరిన్ని యూనిట్లు ఇవ్వాలి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి
న్యూదిల్లీ, మే 6 : తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి మూడు ముఖ్యమైన వినతిపత్రాలు అందజేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తూ, అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి తగు రీతిలో కేంద్రం సహాయ, సహకారాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్పించిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంఎన్ఆర్ఈ ముందే నిర్ణయించినట్లుగా పిఎం కుసుం కంపోనెంట్ ఎ కింద 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని భట్టి విక్రమార్క కేంద్రమంత్రికి విన్నవించారు. ఎంఎన్ఆర్ఈ ఈఓఐ పీరియడ్ ప్రకారం పునఃసమీక్ష అనంతరం కేటాయింపులను 4000 మెగావాట్ల నుంచి 1000 మెగావాట్లకు తగ్గించి ఇవ్వాలని సమాచారం అందిందని అలా తగ్గించి ఇస్తే రాష్ట్రం నిర్ధారించుకున్న లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులున్నందున కేంద్రం ఆచుతూచి వ్యవహరించాలని కోరారు. పునరుత్పాదక ఇందన రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ఫలితాలను దృష్టిలో వుంచుకుని కేటాయింపులు చేయాలని డిప్యూటీ సీఎం కేంద్రమంత్రిని కోరారు.
రాష్ట్రంలోని వ్యవసాయరంగానికి సాగునీటి కల్పనకు శాశ్వత పరిష్కారంగా సౌర పంప్సెట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రం భావిస్తున్నదని ఈ నేపథ్యంలో పిఎం కుసుం కంపోనెంట్ బి కింద 1 లక్ష సౌర పంపు సెట్లను స్థాపించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ను టీఎస్ రెడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. రాష్ట్ర వాటా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రికి వివరించారు. గిరిజనుల సాగు భూముల్లో విద్యుత్ లైన్ల స్థాపనకు అటవీ చట్టాలు ఆటంకంగా వున్నందున ఈ దిశగా కేంద్రం సహృదయంతో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.
2 లక్షల పంపు సెట్లు కేటాయించండి
పిఎం కుసుం కంపోనెంట్ సి కింద తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల పంపు సెట్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్ర భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 28 వ్యవసాయరంగ సాగునీటి అవసరాల కోసం లక్షల పంపు సెట్లు వినియోగంలో వున్నందున సాంప్రదాయ విద్యుత్ రంగం పై భారాన్ని నివారించేందుకు గాను వీటి అవసరాన్ని కేంద్రమంత్రికి వివరించారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ వార్షిక పురోగతి రేటును సాధించడంతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా అవతరించిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైతు భరోసా వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తూ, వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్దతతో పనిచేస్తున్న రాష్ట్రానికి కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు చేసేందుకు వీలవుతుందని వివరించారు.