- ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
- గ్లోబల్ సమ్మిట్ వేదికగా సిఎం జగన్ స్పష్టీకరణ
- పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సమ్మట్కు జ్యోతిప్రజ్వలన
విశాఖపట్టణం,మార్చి3: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్టణమేనని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిప్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని జగన్ చెప్పారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయ బోతున్నా. త్వరలోనే ఇది సాకారమవుతుందని వివరించారు. ఎపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. దేశ ప్రగతిలో రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని తెలిపారు.
ఇక్కడ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని జగన్ చెప్పారు. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని.. మరో 4 కొత్త పోర్టులు రాబోతున్నా యని వెల్లడించారు. పోర్టులకు సపంలో పుష్కలంగా భూములున్నాయని తెలిపారు. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని జగన్ తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవలేదన్నారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నగరం నెలవని వ్యాఖ్యానించారు.
శాఖ : ’అడ్వాంటేజ్ ఎపి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో శుక్ర, శని వారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ’గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం ప్రారంభమైంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్టాన్రికి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
25 దేశాల నుంచి సుమారు ఎనిమిది వేల మంది అతిథులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరారు, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గంటున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ సమ్మిట్ ద్వారా ఐదు లక్షల మంది ఐటి, హెల్త్ కేర్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నారని ప్రభుత్వం చెబుతోంది. ముందుగా సదస్సుకు విచ్చేసిన ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో కళాకారులు స్వాగతం పలికారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజినీ స్వాగతం పలికారు. పారిశ్రామిక దిగ్గజాలు జిఐఎస్కు చేరుకున్నాయి. లేజర్ షో చూపరులను అలరించింది. తొలుతు రాష్ట్ర గీతం ’మా తెలుగు తల్లికి’ ఆలాపన చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన సిఎం జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగించారు. తరువాత మంత్రి బుగ్గన ప్రసంగించారు.