మంత్రి హరీష్ రావుకు రేవంత్ లేఖ
ప్రజాతంత్ర , హైదరాబాద్ : పది రోజులుగా నిమ్స్ కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నర్సుల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. హరీష్ రావు స్వయంగా వెళ్లి కాంట్రాక్టు నర్సులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఏళ్ల తరబడి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసూతి సెలువులు కూడా ఇవ్వడం లేదనీ, అటానమస్ నిబంధనల ప్రకారం వేతనాలు కూడా చెల్లించడం లేదని నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న తమను ప్రతీ 6 నెలలకు ఒకసారి విధుల నుంచి తొలగించి మళ్లీ తీసుకుంటున్నారనీ, దీని వల్ల తమ సినియార్టీ కోల్పోతున్నామని ఆందోలన వ్యక్తం చేస్తున్నారనీ, వెంటనే కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హరీష్ రావుకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.