- ఎప్పటికప్పుడు విభాగాల వారీగా ఐపీ, ఓపీ పేషెంట్ల వివరాలు
- ఎన్నికల కోడ్ పూర్తి అవగానే ఎంఎన్జేలో కొత్త బ్లాక్ ప్రారంభం
- నిమ్స్, ఎంఎన్జే హాస్పిటల్స్ నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : ఓపీ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి పరీక్షలు చేసుకొని, ఫలితాలు వొచ్చి, వైద్యుడిని కలిసి చికిత్స పొందేవరకు పర్యవేక్షించేందుకుగానూ అంతర్గత ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సోమవారం నిమ్స్, ఎం ఎన్ జే హాస్పిటల్స్ నెలవారీ సమీక్ష జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ దవాఖానలు బలోపేతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు. నిమ్స్ పై ప్రజల్లో అత్యంత నమ్మకం ఉందని, దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని అన్నారు.గత కొంత కాలంగా మనం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయనీ, నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ కొరత లేకుండా చూడడంలో అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
అయితే ఎమర్జెన్సీ బెడ్స్ నిర్వహణ మరింత మెరుగవ్వాలన్నారు. స్టెబిలైజ్ చేసిన అనంతరం ఎప్పటికప్పుడు పేషెంట్లను సంబంధిత వార్డులకు షిప్టు చేస్తూ, ఎమర్జెన్సీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ బిల్లుల చెల్లింపు కోసం కొత్త కౌంటర్లు ప్రారంభించడం మంచి విషయం అన్నారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం కలిసి యూకే వైద్య బృందం సహకారంతో చిన్నారులకు గుండె సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. అవసరమైన వారికి చికిత్స అందించేలా ప్లాన్ చేయలన్నారు.దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు సైతం అదే రోజు ఓపీ, కన్సల్టేషన్, పరీక్షలు, డాక్టర్ మెడికల్ అడ్వైస్ పూర్తయ్యేలా చూడాలన్నారు.
దీనికోసం రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు.పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను, నిమ్స్ హాస్పటల్ గుండా బయటి వాహనాలు రాకపోకలు కొనసాగించకుండా చూడాలన్నారు. తద్వారా వాయు కాలుష్యము, సౌండ్ పొల్యూషన్ తగ్గించాలని సూచించారు.హాస్పిటల్ లో సెక్యూరిటీ వారు, నాలుగో తరగతి ఉద్యోగులు పేషెంట్ల, సహాయకులకు సహకరించాలన్నారు.ఎం ఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ ను ఎక్కువగా జిల్లాల్లో నిర్వహించాలని చెప్పారు. కొత్తగా ప్రారంబించిన మాడ్యులర్ థియేటర్లు పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 300 పడకల ఎం ఎన్ జే కొత్త బ్లాక్ ప్రారంభించుకుందామని చెప్పారు.
నిమ్స్కు మంత్రి అభినందనలు…
జనవరి నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జీలు పూర్తి చేసి నిమ్స్ ప్రతిష్టను జాతీయ స్థాయికి చేర్చినందుకు అభినందనలు తెలిపారు. అదే విధంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, డోనర్ల విషయంలో, ట్రాన్స్ప్లాంట్ సర్జరీల విషయంలో 2022 ఏడాదికి గాను తెలంగాణ దేశంలోనే నెంబర్1గా ఉందనీ, దీని వెనుకు నిమ్స్ కృషి చాలా ఉందనీ, ఇందుకు కృషి చేస్తున్న జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత, డీఎంఈ, నిమ్స్ డైరెక్టర్ కు అభినందనలు చెప్పారు. అలాగే ఆర్థో విభాగానికి సంబంధించి స్కోలియోసిస్ (గూని) సమస్య ఉన్నవారికి గడిచిన 3 ఏళ్లలో 200 మందికి సర్జరీలు చేసి నిమ్స్ వైద్యులు చికిత్స అందించానీ, గతేడాదిలోనే దాదాపు 80 సర్జరీలు చేయడం గొప్ప విషయం అన్నారు.
వైద్య బృందాన్ని అభినందించారు. పరిశోధనల విషయంలో నిమ్స్, ఎంఎన్జే హాస్పిటల్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అన్నారు. సమీక్షలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్జే డైరెక్టర్ జయలత, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్య శ్రీ సిఇఒ విశాలాచ్చి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి సీఇ రాజేందర్, హాస్పిటల్స్ అన్ని విభాగాల హెచ్వోడిలు పాల్గొన్నారు.