Take a fresh look at your lifestyle.

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

  • పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ ‌టూ ఫేస్‌ ‌విచారణ
  • అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌నిరాకరణ
  • చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, మార్చి 20 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇడి విచారణకు సోమవార ఎమ్మెల్సీ, కెసిఆర్‌ ‌కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌పిటిషన్‌ను దిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా లేదా అన్న అనుమానాలు వొచ్చినా..చివరకు హాజరయ్యారు. ఈ నెల 20న హాజరు కావాలని ఇచ్చిన నోటీసులతో ఆమె హాజరయ్యారు. దీంతో ఆమెను అధికారులు విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. దిల్లీ లిక్కర్‌ ‌పాలసీలో.. సౌత్‌ ‌గ్రూప్‌ ‌పాత్ర ఏంటీ.. ఆ లావాదేవీలు ఎలా జరిగాయి.. ఎవరెవరు ఆ డబ్బులను సమకూర్చారు.. సౌత్‌ ‌గ్రూపులో వారి పాత్ర ఏంటీ అంటూ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఆప్‌ ‌లీడర్‌ ‌మనీష్‌ ‌సిసోడియా, రామచంద్ర పిళ్లయ్‌ ఇచ్చిన సమాచారంతోపాటు రిమాండ్‌ ‌రిపోర్టులో వాళ్లిద్దరూ చెప్పిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌ ‌స్టేట్‌ ‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్లపై ఆరాతీస్తున్నారు.

మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌పిటిషన్‌ను దిల్లీ కోర్టు నిరాకరించింది. జైల్లో ఉన్న అభిషేక్‌ ‌బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ ‌కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయగా ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 12‌వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ ‌చేయగా.. సౌత్‌ ‌గ్రూపులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో నిందితులకు బెయిల్‌ ఇవ్వటం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణ పూర్తి కాకుండా బెయిల్‌ ఇవ్వొద్దని.. నిందితులు, అనుమానితులందరి విచారణ ఇంకా కొనసాగుతుందని కోర్టులో ఈడీ స్పష్టం చేసింది. పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న దిల్లీ హైకోర్టు.. అభిషేక్‌ ‌బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ ‌పిటీషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదిలావుంటే చట్టంపై గౌరవంతోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారని ఎంపీ రంజిత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఈడీ విచారణకు భయపడి కాదని.. చట్టంపై గౌరవంతో కవిత వెళ్తున్నారాని తెలిపారు. విపక్షాలను టార్గెట్‌ ‌చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం  ఉదయం 10:30 గంటలకు దిల్లీలోని కేసీఆర్‌ ‌నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఈ నెల 20న  హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తో కలిసి ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. ఈ  కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత  మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాత్రి 8.05 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఇదే సమయంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు ఆమె హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ క్రమంలో దిల్లీలోని సీఎం కేసీఆర్‌ అధికార నివాసం నుంచి కవిత తన భర్త అనిల్‌, ‌సీనియర్‌ అడ్వకేట్‌ ‌సోమా భరత్‌ ‌కుమార్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లగా కవితకు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులు మద్దతు ప్రకటించారు.

Leave a Reply