దక్షిణ భారతదేశంలో బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు

పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు
ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి
లిక్కర్‌ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా  బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు
అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా  మోదీ వొదిలిపెట్టరు..
బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కండువాకప్పి ఆహ్వానించిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మార్చి17: సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ  దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ  పాలన పట్ల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌  రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  మోదీ  పాలనపట్ల అభిమానంతోనే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నా రన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ లో బీజేపీలో చేరగా ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌  రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ పాలన పట్ల ఆదరణ పెరుగోతందని.. దీని కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకుంటామని తెలిపారు.  ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు.  ప్రతీ ఒక్కరి నోట.. మోదీ మాట వినబడుతోందని.. గత పదేళ్లలో ఇసుమంత అవినీతికి కూడా తావులేకుండా  పాలన అందించారని,  , అణగారిన వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు వర్గాల సంక్షేమానికి మోదీ నిరంతరం పాటుపడడంతో ప్రజలంతా ఆకర్శితుల్కె  ‘మేమంతా మోదీ కుటుంబం’ అని సగర్వంగా చెబుతున్నారని చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని.. పదేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పాటు  నిరంకుశ, నియంతృత్వ పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలను ప్రజలు ద్వేషించారని విమర్శిచారు. కేసీఆర్‌ కూతురు కవితను మనీలాండరింగ్‌ కేసులో అధికారులు అరెస్టు  చేయడం.. పూర్తిగా ఈడీ దర్యాప్తులో లభించిన ఆధారాలు, ఆమె వద్ద, ఆమెతో కలిసి పనిచేస్తున్న వారు ఇచ్చిన వాంగ్మూలాల కారణంగానే కోర్టులో హాజరు పరిచారని తెలిపారు.
బీజేపీకి, ఈడీకి సంబంధం లేదని.. తప్పుచేసింది ఎంతవారైనా బాధ్యులపై.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తప్పవన్నారు. చివరకు బీజేపీ కార్యకర్తలు తప్పుచేసినా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.  అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకోవడం తోపాటు సిగ్గులేకుండా మద్యం కుంభకోణంలో పాలుపంచుకోవడంపై  పశ్చాత్తాప పడాల్సింది పోయి.. బీజేపీ, మోదీపై అర్థంలేని విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కోర్టు బోనులో తప్పుచేశామని ఒప్పుకుని.. న్యాయపరమైన చర్యలకు సహకరించాల్సింది పోయి.. ఏదో సాధించినట్లు మాట్లాడడం సరికాదన్నారు.  సెల్‌ఫోన్లను ధ్వంసం చేసి.. ఆధారాల్లేకుండా చేసేందుకు ప్రయత్నించిన కవిత తీరును  చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  ‘తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు కవిత లిక్కర్‌ కుంభకోణంలో దూరారా? దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా?’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక ఊళ్లో 16 బెల్టు దుకాణాలు ఉన్న విషయం చూసి ఆశ్చర్యపోయానని.. తెలంగాణలో బెల్టు షాపులను ప్రోత్సహించి.. ప్రజల రక్తం తాగిన కల్వకుంట్ల కుటుంబసభ్యుల బాటలోనే.. ఇవాళ్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీజేపీ తీరును ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా విమర్శిస్తుండటం హాస్యాస్పదమన్నారు. దేశవ్యాప్తంగా అనేక అవినీతి కేసుల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వందల కోట్ల  నల్లధనంతో పట్టుబడిన విషయాన్ని మరిచారా? అని కిషన్‌ రెడ్డి గుర్తుచేశారు. అవినీతి గురించి మాట్లాడే న్కెతిక అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  బీజేపీకి రోజురోజుకూ గ్రామాల్లోనూ బలోపేతం అవుతోందని.. ఇది ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు.
మోదీ పాలనపై ఆకర్షితుడిన్కె పార్టీలో చేరా : అరూరి రమేష్‌
దేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న మోదీ నాయకత్వం పట్ల ఆకర్శితుడన్కె బీజేపీలో చేరుతున్నట్లు  మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు.  దీనికితోడు ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. అందుకే తాను బీజేపీలో చేరానన్నారు. పదేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా మోదీ  పాలన కొనసాగిస్తుండటంతో  గ్రామాల్లో యువత బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ సీనియర్‌ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అయిన..ధర్మారావు, కొండేటి శ్రీధర్‌, జ్కెపాల్‌, పొన్నాల శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆరూరి రమేశ్‌ తో పాటు.. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు తదతరులు పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page