‘‘చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా చూస్తున్న నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.’’
అజయ్ బాబు వాడపల్లి :
చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా చూస్తున్న నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.ఏ సామాజిక సమస్యలకు ఎదురు నిలిచి తన జీవిత కాలమంతామొక్కవోని దీక్షతో తలపడిందో ఖచ్చితంగా తిరిగి అదే మనుధర్మ వ్యవస్థ నేడు ప్రాణం పోసుకునేందుకు సిద్దపడుతూన్నది. మహిళను బానిసగా చూసిన మను ధర్మ పునఃప్రతిష్టకు ఉవ్విళ్ళూరుతున్న హిందూ బ్రాహ్మణ ఫాసిస్ట్ శక్తుల కు ఎదురొడ్డి నిలిచే మహిళా ఉద్యమాన్ని నిర్మించాల్సిన తక్షణ చారిత్రక కర్తవ్యాన్ని ప్రగతిశీల భావజాలంతో ఉద్యమాల బాటన నడిచే ఫెడరేషన్ మహిళా ఉపాధ్యాయులే నిర్వహించాల్సివుంది. సావిత్రీ బాయి ఉద్యమ కార్యాచరణ ఇందుకు మార్గదర్శకంగా దోహదపడుతుంది. కులరక్కసి జడలు విచ్చుకున్న సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని సవాలుగా స్వీకరించి, ఉపాధ్యాయులకు సామాజిక కర్తవ్యాలుంటాయని చాటి,వాటిని నెరవేర్చిన తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి.సమాజానికి, బడికి వున్న సంబంధాలను,వాటిలో సమస్యలను,వాటి పరిష్కారాలను అర్ధం చేసుకోవటానికి ఆమె ఉద్యమ జీవితమే నిఖార్సైన నిర్వచనం.
సావిత్రీబాయి జనవరి 3, 1831న ప్రస్తుత సతారా జిల్లాలో వున్న నైగావ్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో ఖండోజీ నెవేషే పాటిల్ ,లక్ష్మి దంపతులకు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు ముందుగానే వివాహాలు చేసేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే 1840 లో సావిత్రీబాయికి 12 ఏళ్ల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది.జ్యోతిరావు, రచయిత,సామాజిక కార్యకర్త,కుల వ్యతిరేక సంఘ సంస్కర్త, మనే ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. ఆ విధంగా సావిత్రీబాయి వివాహానంతరం విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆమె సాధారణ పాఠశాల నుండి మూడవ,నాల్గవ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి,బోధన పట్ల మక్కువ పెంచుకుంది. ఆమె అహ్మద్నగర్లోని శ్రీమతి ఫరార్ ఇన్స్టిట్యూషన్లో శిక్షణ తీసుకుంది. సావిత్రీబాయి సామాజిక ప్రయత్నాలన్నింటిలోనూ జ్యోతిరావు ఆమెకు అండగా నిలిచారు.
1848లో జ్యోతిరావు, సావిత్రిబాయి యుక్తవయస్సులో ఉన్నప్పుడు పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఈ తొలి ప్రయత్నంతోనే వారికి సవాళ్ళు మొదలయ్యాయి. వారు కుటుంబం నుండి,సంఘం నుండి బహిష్కరణను ఎదుర్కొన్నారు.స్నేహితుడు ఉస్మాన్ షేక్ అతని సోదరి ఫాతిమా షేక్ తోడునిలిచి,పాఠశాలను ప్రారంభించడానికి వారి సొంత స్థలం ఇచ్చారు.ఆ విధంగా వెలుగు చూసిన తొలి పాఠశాలలో సావిత్రీబాయి ప్రథమ ఉపాధ్యాయురాలుగా సేవలందించారు. అంటరానివారిగా పరిగణించబడే మాంగ్ ,మహర్ కులాల పిల్లల కోసం1852లో మూడు ఫూలే పాఠశాలలను ప్రారంభించారు.
విస్తరించిన సేవలు
ఆమె తన భర్తతో కలిసి అంటరానితనం మరియు కుల వ్యవస్థను నిర్మూలించడంలో, అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో పనిచేసింది. దాహంతో ఉన్న అంటరానివారికి నీరు అందించడానికి కూడా ఎవరూ ఇష్టపడని కాలంలో వీరు అంటరానివారి కోసం తమ ఇంట్లో బావిని తెరిచారు.1876 లో వచ్చిన కరువు సమయంలో ఆమె వివిధ ప్రాంతాలలో ఉచిత ఆహారాన్ని పంపిణీ చేసింది. మహారాష్ట్రలో 52 ఉచిత ఆహార వసతి గృహాలను ప్రారంభించారు. ఆమె 24 సెప్టెంబర్ 1873న పూణెలో జ్యోతిరావు స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ సామాజిక సంస్కరణ సంఘంతో కూడా బాధ్యతలు పంచుకుంది. ముస్లింలు, బ్రాహ్మణులు,బ్రాహ్మణేతరులు, మరియు ప్రభుత్వ అధికారులను సభ్యులుగా చేర్చిన సమాజ్ , స్త్రీలు, శూద్రులు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాలు దోపిడీకి గురి కాకుండా విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు.. ఈ సమాజ్లో పూజారి కానీ, ఏ కట్నకానుకలు కానీ లేకుండా కనీస ఖర్చుతో వివాహాలు ఏర్పాటు చేయించారు. వధూవరులు ఇద్దరూ తమ వివాహంలో ‘‘వివాహ ప్రతిజ్ఞలు’’ తీసుకునేవారు. సావిత్రీబాయి దాని మహిళా విభాగానికి అధిపతిగా పనిచేసింది.1890 నవంబర్ 28 న భర్త మరణించడంతో తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.తన భర్త మరణించిన తరువాత, ఆమె సమాజ్
ఛైర్పర్సన్ అయ్యారు. సావిత్రీబాయి తన భర్త తరువాత కూడా సత్య శోధక్ సమాజ్ ద్వారా తన కార్యాచరణను చివరి శ్వాస వరకు ముందుకు తీసుకెళ్లింది.విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త గా కుల మరియు లింగ వివక్షకు వ్యతిరేకంగా తన స్వరం పెంచారు.