వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి
క్యాడర్లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు
ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్ష హోదాలో సిఎం కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : వొచ్చే అసెంబ్లీ ఎనికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ మరోమారు ప్రభంజనం సృష్టించబోతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మళ్లీ గులాబీ పార్టీదే అధికారమని తేల్చి చెప్పారు. వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వొచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తున్నామని చెప్పారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు.
క్యాడర్లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి అని అన్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్ షుడ్ బీ నాట్ బై చాన్స్..బట్ బై చాయిస్. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేటి కాలానికి సరిపోదు. తప్పక విజయం సాధిస్తాం. బీఆర్ఎస్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుంచి భవిష్యత్తులో చేపట్టవచ్చు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ను సైతం నడపొచ్చు’ అని కెసిఆర్ అన్నారు. అలాగే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లు వొచ్చాయన్నదే ముఖ్యమన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్నారు. ‘జాగ్రత్తగా లేకుంటే వి•కే ఇబ్బంది.. నేను చేసేదేం లేదు‘ అంటూ వ్యాఖ్యానించారు. బాగా పనిచేసిన వారికే టిక్కెట్లు ఇస్తామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కేడర్లో అసంతృప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశర చేసారు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ ఇది.
దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బిఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. దేశానికి సాగునీటి విధానం రూపొందించాలని, వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు వెళ్లాలని.. అన్నారు. బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలని..అన్నారు. తెలంగాణలో వున్న రైతు రాజ్యం దేశం అంతటా స్థాపించాలని..ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బిఆర్ఎస్ ముందుకు వెళ్ళాలని..కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలని..శ్రేణులకు సూచించారు.
నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని…దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని.. దేశంలో మౌలిక వసతుల కల్పన చేయాలని…కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని… మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో తీర్మానాలు చేశారు. ఇదే సందర్భలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. కాగా ముందుగా కే కేశవరావు ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు.