క్రమశిక్షణకూ, దాతృత్వానికి  ప్రతీక రంజాన్‌  

‌ముస్లింలకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్‌. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్‌’‌ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం రంజాన్‌. ఈ ‌మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్‌ ఆన్‌ ‌గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన లైలతుల్‌ ‌ఖదర్‌ ‘ ఈనెలలోనే ఉంది. ఈ మాసంలో చేసే ఒక్క సత్కార్యానికి అనేక రెట్లు అధికంగా పుణ్యఫలం లభిస్తుంది. ఒక విధిని ఆచరిస్తే డెబ్భ్కెవిధులు ఆచరించిన దానితో సమానమైన పుణ్యం లభిస్తుంది. విధి కానటువంటి చిన్న సత్కార్యం చేస్తే విధిగాచేసే సత్కార్యంతో సమానమైన పుణ్యం లభిస్తుంది. సమాజంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది.ఫిత్రా’ ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి.

ఫిత్రా అన్నది పేదసాద హక్కు. ఫిత్రా వల్ల వారికి ఆర్థికంగా కాస్తంత ఊరట లభిస్తుంది. ఫిత్రా లో భాగంగా 1.75 కిలో గోధుమలు లేదా 2.75 కిలో జొన్నలు ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో దివంగతుల పేరిట ‘ఇసా అల్కె సవాబ్‌’ (‌దాన ధర్మాలు, పుణ్యకార్యాలు) చేస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతోపాటు పాప ప్రక్షాళన జరుగుతుందని మహ్మద్‌ ‌ప్రవక్త పేర్కొన్నారు ‘జకాత్‌’ ‌కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. రంజాన్‌ ‌మాసంలో రోజా ఆచరించే వారితో పాటు ‘జకాత్‌’ ‘‌ఫిత్రా’ ఇచ్చే వారికి 70 శాతం అధికంగా పుణ్యఫలం దక్కుతుంది. అలాగే బ్కెతుల్‌మాల్‌కు విరాళాలు ఇచ్చిన వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ‘తరావీ నమాజు’ కూడా ఈ నెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యాలు మూటగట్టుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఈ పవిత్ర మాసంలో ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మపరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాన్‌ ‌రోజా పాటిస్తారో వారు గతంలో చేసిన పాపాలను అల్లాహ్‌ ‌మన్నిస్తాడు.

ముస్లింలకు ముఖ్యమైన ఐదు విధులైన ఈమాన్‌, ‌నమాజ్‌, ‌జకాత్‌, ‌రోజా, హజ్‌లలో రోజాను రంజాన్‌ ‌మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారపానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం.నెల పొడుపుతో రంజాన్‌ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్‌ ‌పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్‌ ‌తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్‌ ‌మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్గ్హా లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ‘ ఈద్ముశబారక్‌(‌శుభాకాంక్షలు)చెప్పుకుంటారు. ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభక్తికీ, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్‌ ‌నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్‌ ‌ప్రవక్త బోధించిన మార్గాన్ని ‘ రంజాన్‌’ ‌సుగమం చేస్తుంది. కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఈద్‌ ‌నమాజ్‌ ‌లను గత రెండు సంవత్సరాలుగా ఇండ్లలోనే నిర్వర్తించగా ఈ సారి ఈద్గా లోనే పండగ నమాజ్‌ ‌చేసుకోవడం జరుగుతుంది.

md khaza
డాక్టర్‌ ఎం‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్‌ ‌ఫైనాన్స్
94927913872

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *