ఉక్రెయిన్ యుద్ధం కూడా తోడు కావడంతో మరింత సమస్య
ఆర్బిఐ నివేదిక అంచనా
న్యూ దిల్లీ, ఏప్రిల్ 30 : కోవిడ్-19 మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ, దేశీయ వృద్ధికి జరుగుతున్న నష్టాలు నిత్యావసరాల ధరల పెరుగుదలలోనూ, అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థలో అంతరాయాల ద్వారానూ స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారి ముఖ్యమైన మార్పునకు గుర్తుగా నిలిచిపోతుందని తెలిపింది. దీనివల్ల జరుగుతున్న వ్యవస్థా నిర్మాణపరమైన మార్పులు వి•డియం టెర్మ్లో వృద్ధి మార్గాన్ని మార్చే అవకాశం ఉందని పేర్కొంది. నివేదికను ఆర్బీఐలోని ఆర్థిక, విధాన పరిశోధన శాఖ (డీఈపీఆర్) రూపొందించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఆదాయ నష్టం దాదాపు రూ.52 లక్షల కోట్లు అని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్గ్•నాన్స్ (ఆర్సీఎఫ్)లో ’మహమ్మారి మచ్చలు’ అనే అధ్యాయంలో ఈ మహమ్మారి ప్రభంజనాలు పదే పదే రావడం వల్ల నిలకడగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో తైమ్రాసిక ధోరణులు ఈ మహమ్మారి ఆటుపోట్లకు గురైనట్లు పేర్కొంది. 2020-21 తొలి తైమ్రాసికంలో తీవ్రమైన క్షీణత నమోదైన తర్వాత 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రెండో ప్రభంజనం వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థ వేగం క్రమంగా పుంజుకుందని తెలిపింది. అదే విధంగా 2022 జనవరిలో మూడో ప్రభంజనం వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకునే పక్రియకు పాక్షికంగా దెబ్బతగిలిందని పేర్కొంది. ఈ నివేదికలోని అంశాలన్నీ పూర్తిగా కంట్రిబ్యూటర్స్కు చెందినవేనని, తన అభిప్రాయాలు కాదని ఆర్బీఐ వివరించింది. కోవిడ్ మహమ్మారి రావడానికి పూర్వం ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన సంస్కరణల ఫలితాలు, ఈ మహమ్మారి సమయంలో చేపట్టిన అదనపు చర్యల ఫలితాలు నిలకడగా అధిక వృద్ధి బాట పట్టేందుకు దోహదపడతాయని పేర్కొంది.