Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ

  • డిమాండ్‌ ‌చేస్తూ దిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌ ‌వద్ద షర్మిల ఆందోళన
  • రాష్ట్రపతి భవన్‌కు మార్చ్…అరెస్ట్ ‌చేసి పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌స్టేషన్‌కు తరలింపు

న్యూ దిల్లీ, మార్చి 14 : తెలంగాణ సిఎం కెసిఆర్‌ అవినీతి, అక్రమాలపై విచార చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి పాలనపై మంగళవారం షర్మిల, వైఎస్‌ఆర్‌టీపీ శ్రేణులు పార్లమెంట్‌ ‌మార్చ్ ‌చేపట్టారు. కాగా.. షర్మిల పార్లమెంట్‌ ‌మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్టీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా షర్మిలను ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్‌ ‌చేశారు. వెంటనే షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని… దానిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద స్కామన్నారు. దేశప్రజల సొమ్ము లక్షకోట్ల కేసీఆర్‌ ‌దోచుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కమిషన్ల కోసం రీడిజైన్‌ ‌పేరుతో భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యలు చేశారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును లక్షా 50 వేల కోట్లకు పెంచారన్నారు. మూడుసార్లు ప్రాజెక్టు నిర్మాణ వేయం పెంచారని తెలిపారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రయులు అయ్యారని.. వారికి న్యాయం చెయ్యలేదని మండిపడ్డారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. ఈ సందర్భంగా  వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ’కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’ అంటూ నినాదాలు చేశారు.

ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ ‌పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా నిర్మించారని వైఎస్‌ ‌షర్మిల చెప్పారు. ఇంత ఖర్చు చేసి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చారని చెప్పారు. పంప్‌ ‌హౌజ్‌ ‌ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని, నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. నిర్మాణ పనులపై ఆడిట్‌ ‌జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికే పవర్‌ ‌బిల్‌ ‌రూ.3 వేల కోట్లు ఖర్చయిందని, లోన్లకు వడ్డీలే రూ.13 వేల కోట్లు కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply