యధాతథ స్థితి కొనసాగించకుంటే జైలుకెళ్లక తప్పదు
భూములపై మరోమారు విచారించిన సుప్రీంకోర్టు
విచారణ జూలై 18కి వాయిదా వేసిన ధర్మాసనం
న్యూదిల్లీ,మే15(ఆర్ఎన్ఎ): హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు మొదలు పెట్టారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలంది. కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం కోరారు. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సీఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై కేసుల విషయాన్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేసినట్లు తెలపగా.. ఈ పిటిషన్తో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలనుకుంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. అనంతరం తదుపరి విచారణను జులై 23కి సుప్రీంకోర్టు వాయిదావేసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది.
హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు విచారణ జరిపింది. హెచ్సీయూలో విధ్వంసానికి సంబంధించిన వివరాలన్నింటిని పరిశీలించడానికి ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంవపర్డ్ కమిటీ హెచ్సీయూ విధ్వంసాన్ని పరిశీలించింది. అక్కడి విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల ఒపీనియన్స్ సైతం సేకరించింది. కాగా, అక్కడ జరిగింది విధ్వంసమే.. చెట్లు, జంతువులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికను ఏప్రిల్ 15న కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. అదే రోజు ప్రభుత్వం సైతం నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఇదే సమయంలో మే 15 వరకు రు హెచ్సీయూ అడవుల్లో కూల్చిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. గతంలో విచారణ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని.. అలా ఇవ్వకపోతే సీఎస్ను జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం విధితమే. చెట్లను నాటడానికి ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తారో చెప్పాలంటూ సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, సీఎస్ను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హెచ్చరించింది.