విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : వరంగల్ ఎంజిఎం దవాఖానాలో రోగి కాలు,చేతి వేళ్లను ఎలుకలు కొరికిన ఘటనలో సూపరింటెండెంట్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్గా ఉన్న చంద్రశేఖర్కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం విధించారని ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎంజిఎం దవాఖానాలో చేరిన తొలి రోజే రోగి శ్రీనివాస్ చేయి, వేళ్లను ఎలుకలు కొరకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన మంత్రి హరీష్ రావు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ వార్డును పరిశీలించి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన నివేదిక గురువారం రాత్రికి వచ్చే అవకాశం ఉందనీ, నివేదిక అందిన వెంటనే దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంజిఎం సూపరింటెండెంట్పై బదిలీ వేటు పడింది.