ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు

నేడు  610 జీవో  జారీ అయిన రోజు

తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్క దిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  610 జీ.వో   జారీ చేసిన రోజు డిసెంబర్‌ 30.. తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయం ఏమిటి? అది ఎలా జరిగింది? సవరింపులు, చక్కదిద్దడాలు జరిగాయా? ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి. ఇందుకు సంబంధించి 610 ఉత్తర్వుల జారీ పూర్వాపరాల గురించి తెలిపే ప్రయత్నం ఇది.
ఆంగ్ల భాష రాదన్న సాకుతో,  నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15 సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతేకాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12 సంవతరాలు ఉండాలని సవరించి, నిర్ణయించ బడిరది. 1973 సెప్టెంబర్‌ 23న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టోబర్‌ 18న రాష్ట్రపతి ఉత్త ర్వులు 674 (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌)  జారీ అయి రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, 4 రాయలసీమ మరియు 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు.

ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్‌ లోని మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్‌ రిజర్వేషన్‌ పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆ జిల్లాలో సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్‌  స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయ బడినాయి. రిజర్వు చేయబడినవి పోగా మిగిలినవి ఓపెన్‌ కాంపిటీషన్‌ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. 1919 నుండి అమలులోనున్న నివాస యోగ్యతను 15 నుండి12 కు (1958లో) అనంతరం 1975లో 4సంవత్సరాలకు తగ్గించగా, వివక్షత కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్‌ వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్ధమే పరమార్ధంగా పాలన కొనసాగించడం జరిగింది. నాటి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు నియమిం చిన జయభారత్‌ రెడ్డి, కమల నాథన్‌, ఉమాపతి తో కూడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975 నుండి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36 పేజీల 1981 జూన్‌ నాటి నివేదికలో, జోన్ల రిజర్వేషన్లకు విరుద్దంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5,6 జోన్లలో 58,986 మంది నిబంధనలకు విరుద్ధంగా నియ మింప బడినట్లు పేర్కొనడం జరిగింది.

ఈ నివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1985 డిసెంబర్‌ 30న 610 జీవోను జారీ చేశారు. గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్‌ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో రాయల సీమ ప్రాంతంలో నియుక్తులైన స్థానికేతర ఉద్యోగులను కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు పంపిం చాలన్న ‘‘జీ.ఓ. 564, తేది: 05-12-1985’’ మాత్రం వెంటనే అమలయింది. ఎన్టీఆర్‌ ను గద్దె దింపి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్‌ ను పునః పరిశీలనకై నియ మించగా, నివేదిక సమర్పించిన గిర్గ్లానీ స్థానికేతరులను నిర్ధారించ గల సంపూర్ణ సమాచారం పొంద కుండానే, సమర్పిత నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులను 128 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిం దని వివరించి, వాటిని 18రకాలుగా వర్గీకరించి, పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్‌ నిబంధ నలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్‌ ఆఫీసులను రాష్ట్ర స్థాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈ బదిలీలు తప్పని కమిషన్‌ అభిప్రాయ పడ్డది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం సగం మంది స్థానికేతరులు ఉన్నారని స్పష్టం అయింది.

తెలంగాణ స్వరాష్ట్ర ప్రభుత్వ పాలనలో సదరు అన్యాయానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యకు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగింది సదరు వివక్షత కారణం ప్రధానం కాగా, అట్టి వివక్షత రూపు మాపేందుకు, సిఎం కేసిఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి, 7జోన్లు, 2 మల్టీ జోన్లను 31 జిల్లాలను కలిపి ఖరారు చేశారు. తర్వాత  33 జిల్లాలతో కలిపి తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ – 2018ను అమల్లోకి తెచ్చారు. దీనికి అనుగుణంగా 33 జిల్లాలకు ఉద్యోగులను విభజించే ప్రక్రియ చేపట్టారు.  33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అను గుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శ కాలను రూపొందించింది.  కొత్త జోనల్‌ వ్యవస్థలో స్థానిక కోటా కింద 95 శాతం, ఓపెన్‌ కోటా కింద 5 శాతం చొప్పున జరిగే నియామకాల్లో పూర్తిగా 100 శాతం ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకే చెందేలా,  ఓపెన్‌ కోటాలోని 5 శాతం ఉద్యోగాలకు కూడా తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు కొత్త జోనల్‌ వ్యవస్థ అవకాశం కలిగించింది.
-రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page