అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

  • పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలన
  • ఐదు వందల మందికి ఒక సర్వేయర్‌
  • జిల్లా కేంద్రాల్లో  ఫిర్యాదుల కోసం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌
  • 31‌వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలి
  • సామాజిక సర్వేకు తుది గడువు 13వ తేదీ
  • 14న సంక్షేమ హాస్టల్‌ ‌విద్యార్థులతో సహపంక్తి భోజనం
  • 15,16వ తేదీల్లో జరిగే గ్రూప్‌ -2 ‌పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ‌లో రెవెన్యూ, హౌసింగ్‌. ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌. ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్‌ -2 ‌పరీక్షల నిర్వహణ, మెస్‌ ‌ఛార్జీలపెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..   ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో ‘‘వొచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వ తేదీలోగా పూర్తిచేయాలి. పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్‌ ‌యాప్‌లో నమోదు చేయాలి. ప్రతీ ఐదు వందల మందికి ఒక ఉద్యోగి (సర్వేయర్‌) ‌ను నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. అంతేగాక స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించు కోవాలి. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలి, సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నాం’ అని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

హాస్టళ్లలో తరచూ తనిఖీలు చేయాలి
గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్థుల మెస్‌ ‌ఛార్జీలను ఒక్కసారి కూడాపెంచలేదు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్‌ ‌ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందించే సరుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఈనెల 14వ తేదీన మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,పార్లమెంటు సభ్యులు స్ధానికంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తాం.

ఈ కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా పాల్గొనాలి. సామాజిక సర్వే రాష్ట్రంలో 1కోటీ 16 లక్షల కుటుంబాలకు గాను 1కోటీ 12 లక్షల కుటుంబాల సామాజిక సర్వే (99.09 శాతం) పూర్తిచేశాం. ఇందుకు కృషి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనెల 13వ తేదీ సామాజిక సర్వేకు తుదిగడువు అని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆ తర్వాత ప్రజా పాలన సేవా కేంద్రాలలో కూడా కుటుంబ సర్వే వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 15, 16వ తేదీలలో జరిగే గ్రూప్‌-2 ‌పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page